Chandrayaan 3 landing: చంద్రుడిపైకి నిచ్చెన: విషాదం నుంచి విజయ తీరాలకు
బెంగళూరు: నిరీక్షణ ఫలించింది. కోట్లాదిమంది భారతీయుల పూజలు ఫలించాయి. చందమామ చేతికి అందింది. జాబిల్లిపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. భారత్.. నింగిని జయించింది. ఇస్రో చేపట్టిన చంద్ర మండల యాత్ర.. విజయ తీరాలకు చేరింది. దిగ్విజయమైంది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. కొద్దిసేపటి కిందటే జాబిల్లి మీద అడుగు మోపింది.
ఈ సువర్ణాధ్యాయం కోసం దేశం మొత్తం ఉత్కంఠ భరితంగా ఎదురు చూసిన క్షణాలు సఫలం అయ్యాయి. కలలు సాకారం అయ్యాయి. గతంలో ఎదురైన చేదు సంఘటనలు అధిగమించి.. మరీ జాబిల్లిని అందుకుంది ఇస్రో. చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ అయినట్లు కిందటే ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు.

ఇదే చంద్రయాన్ విషయంలో ఇస్రో గతంలో విఫలమైన విషయం తెలిసిందే. నిజానికి- 2019లోనే ఈ ఘనతను సాధించాల్సి ఉంది. అప్పట్లో ప్రయోగించిన చంద్రయాన్ 2 గమ్యానికి చేరుకోలేకపోయింది. ఆ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన ఇది చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ కావాల్సి ఉన్నప్పటికీ.. అది సాధ్యపడలేదు. చివరి నిమిషంలో గతి తప్పింది. చంద్రుడిపై క్రాష్ ల్యాండింగ్కు గురైంది.
ఈ ప్రయోగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వీక్షించారు. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగకేంద్రానికి వచ్చారప్పట్లో. చంద్రయాన్ 2 సక్సెస్ కాలేకపోవడం అప్పట్లో యావత్ దేశాన్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. విషాదంలో ముంచింది. అప్పటి ఇస్రో ఛైర్మన్ కే శివన్ కన్నీరు పెట్టుకోగా.. మోదీ ఆయనను అక్కున చేర్చుకుని ఓదార్చారు.
సరిగ్గా నాలుగేళ్ల వ్యవధిలో.. నాటి పెను విషాదాన్ని విజయంగా మలచుకోగలిగింది ఇస్రో. అప్పటి అపజయాన్ని విజయానికి మెట్లుగా స్వీకరించింది. ఒక్కో మెట్టును అధిగమిస్తూ ఏకంగా చంద్రమండలానికే నిచ్చెన వేసింది. విజయం అంటే ఇదీ తొడగొట్టి నిరూపించినట్టయింది ఇస్రో. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన అతి కొద్ది దేశాల సరసన నిలిచింది.












Click it and Unblock the Notifications