యూపీ ఎన్నికల వేళ.. ఒవైసీకి బిగ్ షాక్: పొత్తులపై తేల్చేసిన మాయావతి: ప్రయత్నాలపై నీళ్లు
లక్నో: భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న అతి పెద్ద రాష్ట్రం.. ఉత్తర ప్రదేశ్. ఇంకొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఉత్తర ప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్లల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. పెద్ద రాష్ట్రాల్లో ఈ ఎన్నికల సందడి నెలకొనబోతోండటం వల్ల ఉత్తరాదిన రాజకీయ కోలాహలం నెలకొంది. పొత్తుల కోసం ప్రయత్నాలు సాగుతోన్నాయి.
ఈ పరిస్థితుల మధ్య ఉత్తర ప్రదేశ్లో బలంగా ఉన్నఅతి పెద్ద పక్షం బహుజన్ సమాజ్వాది పార్టీ పొత్తులపై తన వైఖరిని స్పష్టం చేసింది. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ ఉదయం ఓ ట్వీట్ చేశారు. తాము ఏ ఒక్క పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవాలని అనుకోవట్లేదని తేల్చి చెప్పారు. ఉత్తర ప్రదేశ్ ఒక్కటే కాకుండా.. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు.

నిజానికి- మాయావతి ఈ ప్రకటన చేయడానికి, పొత్తులపై క్లారిటీ ఇవ్వడానికి ఓ కారణం ఉంది. హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్తో బీఎస్పీ పొత్తు పెట్టుకుంటుందనే వార్తలు ఒక్కసారిగా ఉత్తర ప్రదేశ్లో గుప్పుమన్నాయి. పంజాబ్ తరహాలోనే యూపీ ఎన్నికల్లోనూ మాయావతి పావులు కదుపుతున్నారని, అనూహ్యంగా ఈ సారి ఎఐఎంఐఎంతో పొత్తుకోవచ్చంటూ వార్తలొచ్చాయి. వాటిని తోసిపుచ్చుతూ తన వైఖరిని మాయావతి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications