బెంగాల్ ఎన్నికల్లో లవ్ జిహాద్, గోవుల స్మగ్లింగ్- మమతపై యోగీ ఆదిత్యనాథ్ విమర్శలు
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీని ఇరుకునపెట్టేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్నీ బీజేపీ వదులుకోవడం లేదు. ఇప్పటికే సున్నితమైన అంశాల్ని, మతపరమైన అంశాల్ని తెరపైకి తెచ్చి మమతను టార్గెట్ చేస్తున్న బీజేపీ.. ఇప్పుడు తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అజెండాగా మార్చిన విషయాల్ని ఇక్కడ కూడా ప్రస్తావిస్తోంది. దీంతో లవ్జిహాద్, గోవుల అక్రమ రవాణా వంటి విషయాలు బెంగాల్ ఎన్నికల ప్రచారాస్త్రాలుగా మారిపోతున్నాయి.
బెంగాల్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్.. మమతను టార్గెట్ చేస్తూ ఇవే అంశాలను తెరపైకి తెచ్చారు. బెంగాల్లో లవ్ జిహాద్ అమలవుతుందని, కానీ యూపీలో తాము దానికి వ్యతిరేకంగా చట్టం చేశామని యోగీ గుర్తుచేశారు. కానీ బెంగాల్లో ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా గోవుల అక్రమ రవాణాను మమత సర్కారు ఆపలేకపోతోందని విమర్శించారు. ఆవుల అక్రమ రవాణా ఆపలేక ప్రభుత్వం జిహాద్ను ప్రేమిస్తోందంటూ యోగీ విమర్శించారు. ఇవి ప్రమాదకర కార్యకలాపాలని, భవిష్యత్తులో తీవ్ర ప్రభావం చూపుతాయని యోగీ అన్నారు.
మాల్దాలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగీ ఆదిత్యనాథ్.. బెంగాల్లో దుర్గామాత పూజను నిషేధించారు. కానీ పండుగల సందర్భంగా బలవంతంగా గోవులను వధిస్తున్నారని ఆరోపించారు. గోవుల స్మగ్లింగ్తో జనం మనోభావాలు దెబ్బతింటున్నా మమత సర్కారు మాత్రం మౌనంగా ఉంటోందని యోగీ విమర్శించారు. ఇప్పుడు జై శ్రీరామ్ నినాదాన్ని కూడా నిషేధిస్తన్నారని, ఈ నినాదం చేసిన వారిపై దాడులు చేస్తున్నారని ఆక్షేపించారు. కానీ బీజేపీ జాతీయ నేతలు మాత్రం బెంగాల్లో అందరినీ కలిపి, ఓ కొత్త బెంగాల్ను నిర్మించేందుకు ఇక్కడికి వచ్చామని తెలిపారు.