బీజేపీ సీనియర్ నేత,మాజీ మంత్రి అనుమానాస్పద మృతి... గొంతు నులిమి హత్య...?
ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత,మాజీ మంత్రి ఆత్మారాం తోమర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.గుర్తు తెలియని వ్యక్తులు ఆయన గొంతు నులిమి చంపేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం (సెప్టెంబర్ 9) అర్ధరాత్రి దాటాక భాగ్పట్లోని తన నివాసంలో దుండగులు ఆయన్ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
స్థానిక మీడియా కథనం ప్రకారం... శుక్రవారం ఉదయం డ్రైవర్ విజయ్.. బిజ్రౌల్ రోడ్డులోని ఆత్మారాం తోమర్ ఇంటికి వెళ్లాడు. ఆత్మారాం గది వద్దకు వెళ్లి పలుమార్లు తలుపు తట్టాడు. అటువైపు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఎక్కడో అనుమానం కలిగింది. దీంతో వెంటనే తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లాడు. అప్పటికే ఆత్మారాం మంచంపై విగతజీవిగా పడి వున్నారు. ఆయన మెడకు టవల్ చుట్టి ఉండటం కనిపించింది.
ఆ వెంటనే విజయ్ పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించాడు. ఆత్మారాం ఇంటి వద్ద ఉండాల్సిన ఆయన స్కార్పియో వాహనం కూడా మిస్ అయినట్లు విజయ్ పోలీసులకు తెలిపాడు.పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా... ఇద్దరు వ్యక్తులు ఆత్మారాం ఇంట్లోకి ప్రవేశించడం అందులో స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ ఇద్దరు స్కార్పియో కారులో పారిపోయారు. ఆ ఇద్దరు ఎవరనేది తేల్చేందుకు ప్రస్తుతం అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.ఘటనపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు.
ఆత్మారాం ఆ ఇంట్లో ఒక్కరే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆయన కుటుంబం మరో చోట ఉంటున్నట్లు సమాచారం. ఆత్మారాం హత్యపై పోలీసులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. 1997లో కల్యాణ్ సింగ్ హయాంలో ఆత్మారాం మంత్రిగా పనిచేశారు. ఆయన మృతిపై పలువురు బీజేపీ నేతలు విచారం వ్యక్తం చేశారు.
గత నెలలో బీజేపీ నేత హరిహర్ సింగ్ హత్య :
ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ జిల్లాలో ఈ ఏడాది ఆగస్టులో హరిహర్ సింగ్(65) అనే బీజేపీ నేత హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను హత్య చేశారు. ఆయన ఉంటున్న ఇంటికి 20మీ. దూరంలో ఆయన మృతదేహం లభ్యమైంది. మృతుని మెడపై కత్తి గాట్లను గుర్తించారు. ఆస్తి తగాదాలే హత్యకు కారణమై ఉండొచ్చుననే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
Recommended Video
ఈ ఏడాది ఏప్రిల్లో ఇదే ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో బీజేపీ నేత బ్రజేష్ సింగ్ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను తుపాకీతో కాల్చి చంపారు. బ్రజేష్ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ హత్య జరిగింది.