దారుణం: కారు బానెట్పై 4 కి.మీ రైతును ఈడ్చుకెళ్ళిన బీడీవో, ఎందుకంటే?
లక్నో: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో ఓ అధికారి రైతుల పట్ల వ్యవహరించిన తీరు పలు విమర్శలకు తావిస్తోంది. మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించిన రెండో విడత నిధులను మంజూరు చేయాలని వెళ్ళిన రైతులకు ఆ అధికారి చుక్కలు చూపించాడు. ఓ రైతును తన కారు బానెట్పై ఉన్న నాలుగు కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళాడు. ఈ ఘటనపై అధికారిపై రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు, రైతుపై అధికారి కూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొన్న ఈ అమానవీయ ఘటనపై వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనకు పాల్పడిన అధికారి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని రామ్నగర్ బ్లాక్కు చెందిన కొందరు స్థానికులు మరుగుదొడ్లు నిర్మించుకొన్నారు. అయితే దీనికి సంబంధించిన నిధుల కోసం వారంతా స్థానిక బ్లాక్ డెవలప్ మెంట్ అధికారి కార్యాలయం వద్దకు వెళ్ళారు. మరుగుదొడ్లకు సంబంధించిన రెండో విడత నిధులను విడుదల చేయాలని అడగాలని వారు భావించారు.
బీడీవో కార్యాలయానికి వెళ్ళి తమ సమస్యలను వివరించారు.కానీ, ఎవరూ కూడ స్పందించలేదు. సాయంత్రం వరకు అక్కడే ఎదురుచూశారు. సాయంత్రం బీడీవో పంకజ్ కుమార్ గౌతమ్ సాయంత్రం పూట తన కార్యాలయం నుండి బయటకు వచ్చారు. కనీసం రైతుల సమస్యలను ఆయన వినలేదు.కారులో వెళ్ళిపోతుండగా రైతులు అడ్డుకొన్నారు. తమ సమస్యను చెప్పుకొనే ప్రయత్నం చేశారు.
అయితే అవేవీ ఆయన పట్టించుకోలేదు. పైగా ఈ సమస్యను కారును అలాగే పోనిచ్చాడు. కొందరు రైతులు కారుకు అడ్డుగా నిలిచారు. చివరగా ఓ రైతు ధైర్యం చేసి కారు బానెట్పై పడుకొన్నాడు. అయినా ఆ అధికారి కనికరించలేదు. కారును అలానే నాలుగు కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళాడు. ఈ తతంగాన్ని స్థానికులు వీడియో తీశారు. ఈ వీడియోను ఆ రైతు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
ఈ ఘటనపై రైతుపై అధికారి పంకజ్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. రైతు కూడ అధికారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ విచారణ చేస్తుందని చీఫ్ బ్లాక్ డెవలప్మెంట్ అధికారి ప్రకటించారు.