షాక్: 12ఏళ్లుగా 500మందికిపైగా మైనర్లపై రేప్ చేశాడు
500మందికిపైగా మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో మరో దిగ్భ్రాంతికర దారుణం వెలుగుచూసింది. ఇద్దరు బాలికలపై అఘాయిత్యం చేయబోయిన 38 ఏళ్ల సునీల్ రస్తోగీ అనే టైలర్ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, అతడ్ని విచారించగా అనేక ఘోరాలు వెలుగుచూశాయి. గత 12 ఏళ్లలో తాను దాదాపు 500 మంది పిల్లలపై అఘాయిత్యం చేసినట్లు రస్తోగీ విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
ఇలాంటి నేరాలకు పాల్పడిన ఇంతకుముందు 2006 సంవత్సరంలో ఆరు నెలలు జైల్లో కూడా ఉన్నాడని పోలీసులు చెప్పారు. ప్రధానంగా ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఇంటి నుంచి స్కూళ్లకు నడుచుకుంటూ వెళ్లే బాలికలను ఇతడు లక్ష్యంగా చేసుకునేవాడని పోలీసులు చెప్పారు.
కొంతకాలం పాటు తూర్పు ఢిల్లీలో ఓ టైలరింగ్ దుకాణంలో పనిచేశాడు. తరచు అటూ ఇటూ వెళ్తూ ఉండేవాడు. ప్రస్తుతానికి ఆధారాలు దొరికిన ఆరు కేసుల్లో మాత్రం రస్తోగీని బుక్ చేశారు. వాటిలో మూడు ఢిల్లీ, రెండు రుద్రాపూర్ మరొకటి బిలాస్పూర్ జిల్లాలోనివి. 2004 సంవత్సరంలో మయూర్ విహార్ ప్రాంతంలో ఉండేటప్పుడు పొరుగింట్లో ఉండే ఒక అమ్మాయిపై అఘాయిత్యం చేయబోగా.. చుట్టుపక్కల వాళ్లు చితక్కొట్టి అక్కడినుంచి తరిమేశారు.
గత సంవత్సరం డిసెంబర్ 13వ తేదీన పదేళ్ల బాలిక స్కూలు నుంచి తిరిగొస్తుండగా అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ దుర్మార్గుడు. ఆమె ప్రవర్తన తేడాగా ఉండటంతో ఆమెను అడగ్గా, చివరకు విషయం తెలిసింది. బాలిక చెప్పిన వివరాలను, పోలికలను బట్టి నిందితుడి కోసం పోలీసులు గాలించడం మొదలుపెట్టారు. ఇంతలో జనవరి 12వ తేదీన న్యూ అశోక్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో మరో ఇద్దరు బాలికలు అపహరణకు గురయ్యారని ఫిర్యాదు నమోదైంది.
కొత్త బట్టలు కొనిస్తానని చెప్పి రస్తోగీ వాళ్లను తీసుకెళ్లాడు. నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు వెళ్లి అక్కడ అత్యాచారం చేయబోగా పిల్లలు అరవడంతో అక్కడినుంచి పారిపోయాడు. ఆ తర్వాత అతడిని కోండ్లి గ్రామంలో పోలీసులు అరెస్టు చేశారు. తాను 2004 నుంచి ఈ తరహా నేరాలు చేస్తున్నట్లు విచారణలో రస్తోగీ వెల్లడించడంతో పోలీసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని బాధితుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.