మొదటి డోసులో కోవాగ్జిన్... రెండో డోసులో కోవీషీల్డ్... యూపీలో వైద్యుల నిర్లక్ష్యం...
ఉత్తరప్రదేశ్ మహారాజ్గంజ్ జిల్లాలోని ఓ ఆస్పత్రి వైద్యులు ఓ కోవిడ్ పేషెంట్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మొదటి డోసులో అతనికి కోవాగ్జిన్ ఇచ్చిన వైద్యులు... రెండో డోసులో కోవీషీల్డ్ ఇచ్చారు. ఇప్పటికైతే అతనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనప్పటికీ.. మున్ముందు దీని ప్రభావం ఎలా ఉంటుందోనని అతను ఆందోళన చెందుతున్నాడు.
వివరాల్లోకి వెళ్తే... మహారాజ్గంజ్ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్(సీడీవో) గౌరవ్ సింగ్ సోగర్వాల్ వద్ద ఉమేశ్ అనే వ్యక్తి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనితో పాటు చందన్ కుష్వాహా,అర్దలి మదన్ అనే ఇద్దరు కూడా సీడీవో వద్దే డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఉమేశ్,చందన్,మదన్... ఈ ముగ్గురూ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. మొదటి డోసులో వైద్యులు వీరికి కోవాగ్జిన్ ఇచ్చారు.
బుధవారం(ఏప్రిల్ 14) రెండో డోసు వేయించుకునేందుకు ఉమేశ్ ఆస్పత్రికి వెళ్లగా... వైద్యులు కోవాగ్జిన్కు బదులు కోవీషీల్డ్ రెండో డోసు ఇచ్చారు. ఈ విషయం తెలిసి చందన్,మదన్ రెండో డోసు తీసుకోలేదు. వైద్యుల నిర్లక్ష్యానికి ఉమేశ్ ఆందోళన చెందుతున్నాడు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఏకె శ్రీవాస్తవ మాట్లాడుతూ... ఇప్పటికైతే అతనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని.. అయినప్పటికీ ఇలా జరిగి ఉండాల్సింది కాదని అన్నారు.
రెండు వేర్వేరు కరోనా వ్యాక్సిన్లను కలపడం ద్వారా రోగులకు అది మరింత మేలు చేసే అవకాశం ఉంటుందా...? అన్న దానిపై ప్రస్తుతం పరిశోధనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రెండో డోసులో వేరే వ్యాక్సిన్ను ఇవ్వడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. మోడెర్నా,నోవావ్యాక్స్ వ్యాక్సిన్లను మిక్స్ చేయడం ద్వారా కలిగే ప్రయోజనం గురించి ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నట్లు ఇటీవల పీటీఐ నివేదించింది.
Recommended Video
ఇలా రెండు వేర్వేరు వ్యాక్సిన్లను రెండు డోసుల్లో ఇవ్వడం ద్వారా రోగ నిరోధక శక్తి మెరుగవుతుందా లేక ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందా అన్న దానిపై ఇంకా కచ్చితమైన నివేదికలు రావాల్సి ఉంది. ఇందుకోసం మరి కొంతకాలం పట్టవచ్చు. ప్రస్తుతం భారత్లో కోవాగ్జిన్,కోవీషీల్డ్ వ్యాక్సిన్లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. 45 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. ప్రస్తుతం భారత్లో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. త్వరలోనే మిగతా వయసుల వారికి కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది. అలా అయితేనే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.