ములాయం, అఖిలేష్, స్వామి ప్రసాద్ సహా 30 మంది ఎస్పీ స్టార్ క్యాంపెయినర్లు వీరే: ఆ ముగ్గురికి షాక్
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల త్వరలో జరగనున్న క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులతోపాటు స్టార్ క్యాంపెయినర్లను కూడా ప్రకటిస్తున్నాయి. తాజాగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని అధికారం నుండి గద్దె దించాలని చూస్తున్న సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశకు 30 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది.

అఖిలేష్, ములాయం, స్వామి ప్రసాద్ సహా ఎస్పీ స్టార్ క్యాంపెయినర్లు
ఈ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బీజేపీ నుంచి కొత్తగా పార్టీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కిరణ్మయ్ నందా, ప్రిన్సిపల్ జనరల్ సెక్రటరీ రాంగోపాల్ యాదవ్, రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్, ఆ పార్టీ ఉత్తరప్రదేశ్ చీఫ్ నరేష్ ఉత్తమ్ పటేల్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రాంగోవింద్ చౌదరి తదితరులు ఇతర ప్రముఖ స్టార్ క్యాంపెయినర్లలో ఉన్నారు.

బీజేపీ నుంచి వచ్చిన మాజీ మంత్రులు, ఆజంఖాన్కు షాక్
30 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సమాజ్వాదీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జావేద్ అలీ ఖాన్, సమాజ్వాదీ యువజన సభ అధ్యక్షుడు మహ్మద్ ఫహద్లు కూడా ఉన్నారు. కాగా, ఈ జాబితాలో బీజేపీ నుంచి సమాజ్వాదీ పార్టీలో చేరడానికి మంత్రులుగా రాజీనామా చేసిన దారా సింగ్ చౌహాన్, ధరమ్ సింగ్ సైనీలను చేర్చలేదు.
శాసనమండలిలో ప్రతిపక్ష నేత అహ్మద్ హసన్, మహారాష్ట్ర పార్టీ చీఫ్ అబూ అసిమ్ అజ్మీలకు కూడా ఈ జాబితాలో చోటు దక్కలేదు. అంతేగాక, ప్రస్తుతం జైలులో ఉన్న పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేరలేదు.

యూపీలో మొదటి దశ పోలింగ్ ఫిబ్రవరి 10 నుంచి
కాగా, ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, తదితర పార్టీలు తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించాయి. మరోవైపు, 403 మంది సభ్యులున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 10న మొదటి దశలో షామ్లీ, ముజఫర్నగర్, బాగ్పట్, మీరట్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ్ నగర్, హాపూర్, బులంద్షహర్, అలీఘర్, మథుర, ఆగ్రాలతో సహా 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.












Click it and Unblock the Notifications