మార్పు: మోడీతో భేటీకానున్న అమెరికా రాయబారి
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై అమెరికా తన వైఖరిని మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. గుజరాత్ రాష్ట్రంలో 2002లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో అమెరికా విదేశాంగశాఖ 2005లో నరేంద్ర మోడీకి వీసాను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే మోడీ పట్ల తమ వైఖరిలో మార్పు లేదని పదే పదే చెప్పుకుంటూ వచ్చిన అమెరికా ప్రస్తుతం తన వైఖరిలో కొంత మార్పు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం భారతదేశంలో నరేంద్ర మోడీకి పెరుగుతున్న జనాదరణ నేపథ్యంలో మోడీని వ్యతిరేకించే విషయంలో అగ్రరాజ్యం అమెరికా పునరాలోచనలో పడింది. బిజెపి ప్రధాని అభ్యర్థి మోడీకే వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనేక సర్వేల్లో వెల్లడవుతుండటంతో అమెరికా తన వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే భారతదేశంలో అమెరికా రాయబారిగా కొనసాగుతున్న నాన్సీ పావెల్.. నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. ఫిబ్రవరి 14, 15 తేదీల్లో గుజరాత్లోని గాంధీనగర్లో నరేంద్ర మోడీతో నాన్సీ పావెల్ సమావేశం అవుతారు. గుజరాత్ అల్లర్ల కేసులో ఇటీవల నరేంద్ర మోడీకి కోర్టు క్లీన్చిట్ ఇచ్చిన నేపథ్యంలో మోడీ పట్ల అమెరికా తన వైఖరిని మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ వచ్చే సాధారణ ఎన్నికల్లో నరేంద్ర మోడీ సారథ్యంలోని బిజెపి అధికారంలోకి వస్తే ఆయనతో కలిసి పని చేయాల్సి రావచ్చన్న అభిప్రాయంతో నరేంద్ర మోడీతో సత్సంబంధాలు కొనసాగించాలని అమెరికా భావిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా నరేంద్ర మోడీ తమ దేశానికి వచ్చేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అమెరికాకు చెందిన ఓ సీనియర్ అధికారి ఇప్పటికే రెండు సార్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications