అమెరికా దుస్సాహసం-భారత జలాల్లో విన్యాసాలు- సమర్ధించుకున్న యూఎస్
అమెరికా నేవీకి చెందిన ఓ యుద్దనౌక భారత జలాల్లోకి అనధికారికంగా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా విన్యాసాలు కూడా నిర్వహించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. భారత జలాల్లోని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో అమెరికా నేవీ నిర్వహించిన ఈ విన్యాసాలు భారత సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసేలా ఉన్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తాము భారత జలాల్లో అనధికారికంగా విన్యాసాలు నిర్వహించిన విషయాన్ని యూఎస్నేవీ అధికారికంగానే అంగీకరించడం మరో విశేషం.
అమెరికా నేవీ దుస్సాహసం
భారత్-అమెరికా మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయని భావిస్తున్న తరుణంలో అమెరికా నేవీ ఓ దుస్సాహసానికి ఒడిగట్టింది. భారత జలాల్లోకి అనధికారికంగా చొరబడింది. అంతే కాదు తాము చొరబడినట్లు అధికారికంగా అంగీకరించింది. కూడా. దీంతో భారత్కు ఏం చేయాలో పాలుపోని పరిస్దితి. తొందరపడి చర్యలకు దిగితే అమెరికాతో సత్సంబంధాలపై ప్రభావం పడుతుంది. అలాగని మిన్నకుండిపోతే మరో చైనాలా ఏకు మేకవుతుందన్న భయం. దీంతో ఇప్పుడు కేంద్రం ఏం చేయబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది.
భారత జలాల్లో అమెరికా యుద్దనౌక విన్యాసాలు
అమెరికా నౌకాదళానికి చెందిన యుద్దనౌక యూఎస్ఎస్ జాన్ పాల్ జోన్స్ లక్షద్వీప్కు పశ్చిమాన 110 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న భారత్కు చెందిన ప్రత్యేక ఆర్దిక మండలిలోకి తాజాగా చొరబడింది. అంతే కాదు విన్యాసాలు కూడా నిర్వహించింది. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా, నావిగేషన్ హక్కులు లేకుండా భారత్తో పాటు అంతర్జాతీయ చట్టాల్ని ఉల్లంఘించి అమెరికా నౌక ఈ దుస్సాహసానికి పాల్పడింది. దీంతో ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.
చొరబాటు అంగీకరించిన అమెరికా నేవీ
భారత్కు చెందిన ప్రత్యేక ఆర్దికమండలిలోకి తమ దేశానికి చెందిన యూఎస్ఎస్ జాన్ పాల్ జోన్స్ నౌక చొరబడటాన్ని అమెరికా అంగీకరించింది. ఎలాంటి అనుమతుల్లేకుండా ప్రత్యేక ఆర్ధికమండలి ( ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్)లోకి తమ నౌక ప్రవేశించినట్లు రెండు రోజుల క్రితం అమెరికా నేవీ వెల్లడించింది. 'ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఆపరేషన్' పేరుతో తాము ఇక్కడ విన్యాసాలు నిర్వహించినట్లు అమెరికా నేవీకి చెందిన ఏడో ఫ్లీట్ ఈ ప్రకటన చేసింది.
ఇవన్నీ మామూలేన్న అమెరికా నేవీ
భారత జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి విన్యాసాలు నిర్వహించడమే కాకుండా దాన్ని అమెరికా నేవీ సమర్ధించుకుంది. ఇలాంటివన్నీ మామూలేనని చెప్పుకొచ్చింది. ఇలాంటి ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్లు తమకు సర్వసాధారమమేనని, గతంలోనూ ఇలాంటివి చాలా చేశామని, భవిష్యత్తులోనూ చేస్తామని కూడా నేవీ చేసిన ప్రకటన తీవ్ర కలకలం రేపుతోంది. దీనిపై రాజకీయ ప్రకటనలు చెల్లవంటూ కూడా నేవీ అధికారులు తమ ప్రకటనలో పేర్కొన్నారు.
అమెరికా చర్యపై మండిపడ్డ మాజీ నేవీ ఛీఫ్
భారత జలాల్లో అమెరికా నేవీ నిర్వహించిన ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఆపరేషన్పై భారత నౌకదళ మాజీ అధిపతి అడ్మిరల్ అరుణ్ ప్రకాష్ మండిపడ్డారు. భారత జలాల్లోకి చొరబడటమే కాకుండా అమెరికా నేవీ స్పందించిన విధానం వ్యంగంగా ఉందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. 1995లో భారత్.. అమెరికా రూపొందించిన సముద్ర చట్టాన్ని ఆమోదించినా దీన్ని అమలు చేయడంలో విఫలమైందని పేర్కొన్నారు. ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఆపరేషన్ పేరుతో అక్రమంగా విన్యాసాలు చేపట్టడం తప్పని ఆయన తెలిపారు.
Recommended Video