యూపీ సీఎం అభ్యర్ధిపై ప్రియాంక గాంధీ యూటర్న్- తాను పోటీలో లేనని క్లారిటీ
యూపీలో కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం అభ్యర్ధి ఎవరని అడిగిన ప్రశ్నకు చూస్తున్నారుగా ఉంటూ పరోక్షంగా సమాధానమిచ్చి ఊహాగానాలకు తెరలేపిన ప్రియాంక గాంధీ వాద్రా ఇవాళ వెనక్కి తగ్గారు. తాను చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. యూపీలో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్ధి తాను కాదన్నారు.
హోరాహోరీగా సాగుతున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్ధిగా యోగీ ఆదిత్యనాథ్, ఎస్పీ తరఫున అఖిలేష్ యాదవ్ సీఎం అభ్యర్ధులుగా ఉన్నారు. వీరి మధ్యలో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్ధిగా ఎవరనే ప్రశ్న తలెత్తింది. దీంతో మీడియా పదే పదే ప్రశ్నించడంతో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా పరోక్షంగా సమాధానం ఇచ్చారు. దీంతో యూపీలో కాంగ్రెస్ సీఎఁ అభ్యర్ధి ఆమేనన్న వార్తలు వచ్చాయి. దీంతో సీఎం అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ ఆమెను నేరుగానే ప్రకటించవచ్చు కదా అనే చర్చ కూడా జరుగుతోంది. దీనిపై ప్రియాంక క్లారిటీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్ధిత్వంపై తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న ప్రియాంక గాంధీ... యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్ధి తాను కాదన్నారు. తాను యూపీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్ధినని అనడం లేదన్నారు. మీరందరూ అదే ప్రశ్నను పదే పదే అడుగుతున్నారు కాబట్టి (మీకు ప్రతిచోటా నా ముఖం కనిపిస్తుంది) అని చికాకుతో అన్నాను" అని ఆమె అన్నారు. మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎక్కడ చూసినా తన ముఖమే కనిపిస్తోందని మాత్రమే తాను అన్నానని, సీఎం అభ్యర్ధి అని అనలేదన్నారు.
దీంతో యూపీలో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్ధిత్వంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. వాస్తవానికి యూపీలో కాంగ్రెస్ కు పది సీట్లు రావడమే కష్టమని భావిస్తున్న తరుణంలో సీఎం అభ్యర్ధిత్వం గురించి మాట్లాడటంపై విమర్శలు వస్తున్నాయి. దీంతో ప్రియాంక క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.