ఎట్టకేలకు అజాం ఖాన్ గేదెల దొంగ దొరికాడు
లక్నో: సమాజ్ వాదీ పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ మంత్రి అజాం ఖాన్ గేదెలను దొంగిలించిన దొంగను ఎట్టకేలకు పోలీసులకు అరెస్టు చేశారు. 2014, జనవరి 31వ తేదీన అజాం ఖాన్కు చెందిన ఫాం హౌస్ నుంచి లక్షల విలువైన ఏడు గేదెలను దుండగులు అపహరించిన సంగతి తెలిసిందే.
దీనిపై ఆ రాష్ట్ర మంత్రి అజాం ఖాన్ ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ గేదెల ఆచూకీ కనిపెట్టి, దొంగతనానికి పాల్పడిన నిందితుల్లో ఒకడైన చునాన్ను బుధవారం అరెస్టు చేశారు. విచారణలో ఈ దొంగతనానికి పాల్పడింది ఐదుగురు అని తేలింది.
వీరిలో ముగ్గురు దొంగతనానికి ప్లాన్ వేయగా, మరో ఇద్దరు ఆ గేదెలను అక్కడ నుంచి తరలించినట్లు మొరాదాబాద్ పోలీస్ సూపరిండెంట్ ప్రవాల్ ప్రతాప్ సింగ్ తెలిపారు. 2014లో జరిగిన ఈ గేదెల చోరీ కేసులో ముగ్గురు పోలీసులు సస్పెండ్కు గురయ్యారు.
మంత్రిగారి అదేశాలతో ఏడు గేదెలను కనిపెట్టేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. ఎట్టకేలకు దొంగను అరెస్టు చేశారు. గేదెల చోరీ కేసుకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్వవహరించారని అప్పట్లో ముగ్గురిని సస్పెండ్ కూడా చేశారు.