150 మందికి పైగా జలసమాధి?: మృతుల సంఖ్య మరింత: మట్టికుప్పగా కుగ్రామం: సీఎం సందర్శన
డెహ్రాడూన్: దేవభూమిగా పేరున్న ఉత్తరాకండ్.. మరోసారి మరుభూమిగా మారింది. చమోలీ జిల్లాలో అనూహ్యంగా చోటు చేసుకున్న వరదల బారిన పడి కనీసం 150 మంది మరణించి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంఘటన చోటు చేసుకున్న తరువాత 300 మందికి పైగా గల్లంతయ్యారని, వారిలో కొందరు సురక్షితంగా బయటపడినట్లు సమాచారం అందిందని చెప్పారు.100 నుంచి 150 మంది వరకు ఫ్లాష్ ఫ్లడ్ బారిన పడి మరణించి ఉంటారని పేర్కొన్నారు.
ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని తపోవన్ ప్రాంతం గుండా ప్రవహిస్తోన్న ధౌలిగంగా నదికి అకస్మాత్తుగా వరద ప్రవాహం పెరగడం వల్ల దాని మీద నిర్మిస్తోన్న ఆనకట్ట తెగిపోయింది. 24 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యంతో తపోవన్ జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఉన్న కార్మికులందరూ ఈ ఘటనలో గల్లంతయ్యారు. ఆనకట్ట తెగడం వల్ల దిగువకు ప్రవహించిన ధౌలిగంగ జలాలు రైనీ గ్రామాన్ని ముంచెత్తాయి. వరద నీటి ప్రవాహానికి పలు నివాసాలు కొట్టుకెళ్లాయి. పదుల సంఖ్యలో స్థానికులు గల్లంతు అయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు.
చమోలీ జిల్లాలో విస్తరించిన నందా దేవి జాతీయ పార్క్లో కొండ చరియలు విరిగి పడటం వల్ల ధౌలిగంగా నదికి ఒక్కసారిగా ప్రవాహం పెరిగింది. ఈ ప్రవాహ ఉధృతిని, నదీ జలాల తాకిడికి తపోవన్ హైడల్ ప్రాజెక్ట్, ఆనకట్ట నిలువలేకపోయాయి. అట్టముక్కలా తెగిపోయాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. పెద్దఎత్తున సహాయక చర్యలను చేపట్టాయి. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నాయి. దీనికోసం వైమానిక దళం నుంచి హెలికాప్టర్లను రప్పించారు. ఐటీబీపీ జవాన్లు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు ఇందులో భాగస్వామ్యం అయ్యాయి.
సహాయక చర్యలను పర్యవేక్షించడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. చమోలి జిల్లా కేంద్రంలో ఆయన మకాం వేశారు. సహాయక చర్యల గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. వీలైనంత మేర ప్రాణనష్టాన్ని నివరించడానికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టామని ఆయన వెల్లడించారు. అయినప్పటికీ.. 100 నుంచి 150 మంది మరణించి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్దారించినట్లు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదని చెప్పారు.