ఇది మోడీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లో ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న ప్రధాని మోడీ ఆలోచన ఫలించలేదని, అక్కడ ప్రజాస్వామ్యమే గెలిచిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మంగళవారం బలపరీక్ష ముగిసిన తర్వాత ఈ మేరకు ట్విట్టర్లో అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
హరీశ్ రావత్ బలపరీక్ష ముగిసిన తర్వాత కేజ్రీవాల్ మోడీపై ఎదురుదాడికి దిగారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో కాంగ్రెస్ గెలవడం ప్రధాని మోడీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బగా ఆయన అభివర్ణించారు. ఇక నుంచైనా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తన అధికారాన్ని వినియోగించుకుని రాష్ట్రాల్లోని బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చడం మానుకోవాలని హితవు పలికారు.
ప్రధాని మోడీ ఇకనైనా ప్రభుత్వాలను కూల్చడం మానుకుంటారని ఆశిస్తున్నానని ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
Thanks for not tweeting when 2 videos of Harish Rawat emerged nailing him for paying ₹25 lakh bribes @ArvindKejriwal pic.twitter.com/2DLu3cTm1O
— गीतिका (@ggiittiikkaa) 10 May 2016
సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో, వీడియో రికార్డింగ్లో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బలపరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ బల పరీక్ష వివరాలు సీల్డు కవర్లో అత్యున్నత న్యాయస్థానానికి అందజేస్తారు. ఫలితాన్ని సుప్రీంకోర్టు రేపు అధికారికంగా ప్రకటించనుంది.
కాగా, ఈ ఫలితం హరీశ్ రావత్ కు అనుకూలంగా వచ్చినట్టు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి. బలపరీక్షలో తమదే విజయమని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేసింది. ఉత్తరాఖండ్లో మళ్లీ రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. మైనారిటీలో పడిన హరీశ్ రావత్ సర్కారు తన బలాన్ని నిరూపించుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.