అసెంబ్లీ ఎన్నికల వేళ..బీజేపీ పాలిత రాష్ట్ర గవర్నర్ రాజీనామా: ఇన్ఛార్జిలను నియమించిన వెంటనే!
డెహ్రాడున్: వచ్చే ఏడాది ఎన్నికల సంవత్సరంగా మిగిలిపోనుంది. అయిదు పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వాటిల్లో మెజారిటీ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఈ సంవత్సరం నిర్వహించిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేకపోయింది కాషాయ పార్టీ. అస్సాంలో అధికారాన్ని నిలబెట్టుకోగా.. తమిళనాడులో ఆ అవకాశం దక్కలేదు. అధికార అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని, ఎన్నికల్లో పోటీ చేసినా పరాజయం నుంచి తప్పించుకోలేకపోయింది. కేరళలో కనీసం ఖాతా తెరవలేకపోయింది.

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అగ్నిపరీక్ష..
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ధాటికి కమలం కమిలిపోయింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న పశ్చిమ బెంగాల్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది కమలనాథులకు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడించామనే తృప్తి తప్ప.. వారికి మింగిలిందేమీ లేదక్కడ. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మిత్రపక్షంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది కూడా అసెంబ్లీ ఎన్నికల అగ్నిపరీక్షను బీజేపీ ఎదుర్కొనబోతోంది. ఈ ఏడాది చవి చూసిన చేదు ఫలితాలు పునరావృతం కాకూడదనే పట్టుదలతో కనిపిస్తోంది.

గవర్నర్ రాజీనామా..
ఈ పరిణామాల మధ్య ఉత్తరాఖండ్ గవర్నర్ బేబి రాణి మౌర్య రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనే రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ కూడా ఒకటి. అతి తక్కువ కాలంలో ఇద్దరు ముఖ్యమంత్రులను మార్చిన రాష్ట్రంగా కూడా ఉత్తరాఖండ్ గుర్తింపు పొందింది. అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆమె రాజీనామా చేయడం రాజకీయ కోణంతోనే చూస్తోన్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో బీజేపీ అధికారంలో ఉంది.

ముఖ్యమంత్రుల మార్పుతో..
పుష్కర్ సింగ్ ధమి అక్కడ ముఖ్యమంత్రి. ఆయన సారథ్యంలోనే బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. మొదట- ముఖ్యమంత్రిగా పని చేసిన త్రివేంద్ర సింగ్ రావత్ను తప్పించింది బీజేపీ అధిష్ఠానం. ఆయన స్థానంలో లోక్సభ సభ్యుడు తీరథ్ సింగ్ రావత్ను ముఖ్యమంత్రిగా నియమించింది. కొన్ని నెలల తరువాత.. ఆయనను కూడా తప్పించింది. పుష్కర్ సింగ్ ధమీని నియమించింది. అతి తక్కువ కాలంలో చోటు చేసుకున్న ముఖ్యమంత్రుల మార్పుతో కొంత ప్రతికూల పరిస్థితులను బీజేపీ నాయకులు తమకు తాముగా సృష్టించుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

రాష్ట్రపతి కార్యాలయానికి
ఇలాంటి పరిస్థితుల్లో- గవర్నర్ బేబి రాణి మౌర్య కూడా రాజీనామా చేయడం చర్చనీయాంశమౌతోంది. కొద్దిసేపటి కిందటే ఆమె తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు పంపించారు. ఈ విషయాన్ని గవర్నర్ కార్యాలయ కార్యదర్శి బీకే సంత్ తెలిపారు. సాధారణంగా- గవర్నర్ హోదాలో ఉన్నవారెవరూ రాజీనామా చేయరు. అవసరమైతే వారిని రీకాల్ చేస్తారే తప్ప ఆ హోదా నుంచి తప్పించరు. ఒక్కసారి గవర్నర్గా నియమితులైన తరువాత అర్ధాంతరంగా వైదొలగిన సందర్భాలు చాలా తక్కువ.

ఎన్నికల ఇన్ఛార్జ్లను ప్రకటించిన కొద్దిసేపటికే..
అనారోగ్య కారణాలైనా సరే.. అదే హోదాలో కొనసాగుతారే తప్ప రాజీనామాలకు పూనుకోరు. అలాంటి- కీలకమైన, రాజ్యాంగబద్ధమైన హోదా నుంచి బేబి రాణి మౌర్య తప్పుకోవడం.. అదీ అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో చోటు చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఉత్తరాఖండ్ ఎన్నికల ఇన్ఛార్జ్గా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, సహ ఇన్ఛార్జ్గా లోక్సభ సభ్యురాలు లాకెట్ ఛటర్జీని నియమించింది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ.

కొత్త వారెవరు?
వారిద్దరినీ ఇన్ఛార్జ్గా నియమించిన కొద్దిసేపటికే- గవర్నర్ బేబి రాణి మౌర్య రాజీనామా చేశారు. ఎన్నికల కారణాలతోనే ఆమె తన పదవికి రాజీనామా చేశారని అంటున్నారు. గవర్నర్గా బేబి రాణి మౌర్య తప్పుకోవడంతో ఆమె స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది. ఉత్తరాది రాజకీయాల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్న వారిని గవర్నర్గా పంపించే అవకాశాలు లేకపోలేదని సమాచారం. లేదా- మరో గవర్నర్కు ఇన్ఛార్జ్గా బాధ్యతలను అప్పగిస్తారా? అనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications