పోలా.. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఫ్రేమ్ అద్దిరిపోలా..!!
Snowfall: ఉత్తరాది రాష్ట్రాలను చలి వెంటాడుతోంది. గజగజమంటూ వణికిస్తోంది. కొన్ని రోజులుగా చలిగాలులు దాదాపుగా అన్ని రాష్ట్రాలను చుట్టుముట్టాయి. దట్టమైన పొగమంచు అలముకుంటోంది. దేశ రాజధాని సహా నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో గడ్డకట్టించే వాతావరణం నెలకొంటోంది. హిమాలయాల పశ్చిమ ప్రాంతం మీదుగా వీస్తోన్న గాలుల ప్రభావం వల్ల చలి అమాంతంగా పెరిగినట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మున్ముందు రాత్రి ఉష్ణోగ్రత మరింత క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ఏకధాటిగా మంచు వర్షం..
అటు జమ్మూ కాశ్మీర్లో ఏకధాటిగా మంచు వర్షం కురుస్తోంది. గందర్బల్, సోపొర్, బండీపొర, కుప్వారాల్లో దీని తీవ్రత అత్యధికంగా కనిపిస్తోంది. మంచు దుప్పటి కప్పుకొన్నట్లు కనిపిస్తోన్నాయా ప్రాంతాలన్నీ కూడా. చెట్లు, ఇళ్ల పైకప్పులపై దట్టంగా మంచు పేరుకుపోయింది. ఇళ్ల బయట పార్క్ చేసి ఉంచిన వాహనాలను మంచు కప్పేసింది. రోడ్లపై నాలుగైదు అంగుళాల మేర మంచు ఏర్పడటంతో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. జమ్మూలో కనిష్ఠ ఉష్ణోగ్రత తొమ్మిది డిగ్రీల సెల్సియస్గా రికార్డయింది.

గడ్డకట్టిన దాల్ లేక్..
అక్కడి ప్రఖ్యాత దాల్ లేక్ గడ్డకట్టుకుపోయిన స్థితిలో కనిపించింది. భూతల స్వర్గంగా మారింది. మంచు కురుస్తోన్న నేపథ్యంలో పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. బనిహాల్ లో ఏకధాటిగా మంచు కురుస్తోంది. ఇక్కడి రైల్వే స్టేషన్ లో అడుగు మేర మంచు పేరుకుపోయింది. ఎటు చూసినా మంచే. ఏ స్విట్జర్లాండ్ లోనూ ఉన్న అనుభూతిని కలిగిస్తోంది. దీనికి సంబంధించిన ఓ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మంచులో సింగారించుకున్న వందే భారత్..
ఈ మంచు కురుస్తున్న సమయంలో.. ఓ ఆరెంజ్ కలర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు స్టేషన్ లో ప్రవేశించడం ఈ వీడియోలో చూడొచ్చు. కాట్రా నుండి శ్రీనగర్కు వెళ్తున్న వందే భారత్ రైలు అది. మంచు దుప్పటి కప్పుకొని మరింత అందంగా కనిపించిందా రైలు. మామూలుగానే అందంగా కనిపించే ఈ రైలు.. మంచులో మరింత మనోహరంగా కనువిందు చేసింది.
#WATCH | J&K | Vande Bharat train from Katra to Srinagar travels through snow as the region recieves fresh spell of snowfall
— ANI (@ANI) January 23, 2026
Visuals from Banihal pic.twitter.com/G8TPXAoqqT
కట్టిపడేస్తోన్న సీన్..
ఇది నెటిజన్లను కట్టి పడిస్తోంది. విపరీతంగా ఆకట్టుకుంటోంది. రైలు చుట్టూ తెల్లని మంచు పరచుకుని ఉండగా.. దీని చుట్టూ కనిపించే కొండలు, సొరంగాలు, రైలు పట్టాలన్నీ గుట్టలుగా పేరుకుపోయిన మంచుతో పూర్తిగా కప్పుకుని ఉండటం.. దీన్ని రెట్టింపు చేస్తోంది. రైల్వేస్టేషన్ లో పట్టాలపై పేరుకుపోయిన మంచును సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగిస్తోన్నారు. విపరీతంగా కురుస్తోన్న ఈ మంచు వల్ల రైళ్ల రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడింది. అవి నెమ్మదిగా రాకపోకలు సాగిస్తోన్నాయి.












Click it and Unblock the Notifications