మోడీ పోటీ, వారణాసి: నిలదీసిన సుష్మా స్వరాజ్, జోషి
ఈ క్రమంలో సమావేశం మధ్యలోనే సుష్మా బయటికి వచ్చేయడంతో ఆమె నిరసనగా వాకౌట్ చేసినట్లు వార్తలొచ్చాయి. ప్రధాని అభ్యర్థిగా లోకసభ ఎన్నికల్లో గుజరాత్, ఉత్తరప్రదేశ్ల నుంచి మోడీ పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశముందని జరుగుతున్న ప్రచారం... ఆ పార్టీ సీనియర్ నేత, వారణాసి సిట్టింగ్ ఎంపి మురళీ మనోహర్ జోషీకి ఆగ్రహం తెప్పించింది.
వారణాసిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఇలాంటి వార్తలు ఎలా వస్తాయని, ఏదైనా నిర్ణయం తీసుకున్నారా? తీసుకోకపోతే మరి వీటిని ఎందుకు ఖండించరని స్పష్టత ఎందుకివ్వారని రాజ్నాథ్ను ప్రశ్నించారు. వారణాసి నుంచి పోటీపై ఆయన వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరట. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడాన్ని వ్యతిరేకించిన సీనియర్ నేతల్లో జోషీ కూడా ఒకరు.
అయితే, అత్యధిక ఎంపీ స్థానాల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్ నుంచి, అందులోనూ మూడు ప్రధాన ఆలయాల నగరాలైన మధుర, అయోధ్య, వారణాసిల్లో ఒకదాని నుంచి హిందూత్వకు ప్రతిరూపం అయిన మోడీ పోటీ చేయడం ఆర్ఎస్ఎస్కు కూడా ఎంతో ముఖ్యం. ఈ నేపథ్యంలో ఆయన వారణాసి నుంచి పోటీ చేస్తారని వార్తలొస్తున్నాయి.
మరోవైపు, సుష్మా స్వరాజ్ కూడా ఎన్డీయేలోకి పార్టీలను ఆహ్వానించే విషయంపై పార్టీ తీరును తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ విషయాలపై చర్చించడానికి పార్లమెంటరీ బోర్డును పిలవాలని వెంకయ్య నాయుడు సూచించినప్పుడు సుష్మా మరింత తీవ్రంగా స్పందించారు. కర్ణాటకలో కళంకిత బిఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకోవడాన్ని ఆమె మరోసారి వ్యతిరేకించారు.
రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీతో పొత్తు, బిఎస్సార్ కాంగ్రెస్ విలీనం వంటి అంశాలపై చర్చించడానికి పార్టీ పార్లమెంటరీ బోర్డును ఎందుకు సమావేశపర్చడం లేదని రాజ్నాథ్ను ఆమె ప్రశ్నించారు. బళ్లారి సోదరులకు తాను ఏ సమయంలోనూ మద్దతుగా లేకపోయినా, వారికి తాను రాజకీయ గురువుగా ఉన్నట్లు వాతావరణం సృష్టించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారట. అనంతరం ఆమె బయటకు వెళ్లిపోయారట.