సంప్రదాయాలను మంటగలుపుతోంది: కాంగ్రెస్ పార్టీని ఏకేసిన వెంకయ్య
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేతలపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన శనివారం భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సభ్యులు పార్లమెంటులో సభా సంప్రదాయాలను మంటగలుపుతున్నారని ధ్వజమెత్తారు.
పార్లమెంటును సజావుగా జరిపేందుకు సహకరించడం లేదని వెంకయ్యనాయుడు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కాంగ్రెస్ పార్టీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూనే మాట్లాడకుండా చేసుకుంటున్నారని కాంగ్రెస్ సభ్యులపై మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ నేతలకు ఏం కావాలో వారికే తెలియదని, ఏం చేస్తున్నారో కూడా వారికి తెలియడం లేదని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధాని నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. మోడీని మృత్యు బెహారీ అన్నారని చెప్పారు.

తమ పార్టీ కార్యాలయంలో ఛాయ్ అమ్ముకోమంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్.. మోడీపై అవమానకర వ్యాఖ్యలు చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, రషీద్, సల్మాన్ ఖుర్షిద్లు కూడా మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ దేశంలోని అన్ని రకాల వ్యవస్థలు, సంస్థలు, సంప్రదాయాలను మంటగలిపిందని ఆరోపించారు. పార్లమెంట్ను నడవనీయకుండా కాంగ్రెస్ కుట్రలు చేస్తోందన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై కాంగ్రెస్ పార్టీ అనసవర రాద్ధాంతం చేస్తోందని వెంకయ్యనాయుడు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications