వస్తుందో.. చెప్పలేను, సంతోషంగా ఉంది: టిపై దిగ్విజయ్
న్యూఢిల్లీ: ఈ పార్లమెంటు సమావేశాలలోనే తెలంగాణ బిల్లు వస్తుందో రాదో చెప్పలేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ గురువారం న్యూఢిల్లీలో అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసన సభ, శాసన మండలిలో చర్చ జరగుతున్న విషయం తెలిసిందే.
దీనిపై ఆయన స్పందించారు. బిల్లు పైన అసెంబ్లీలో చర్చ జరగడం సంతోషకరమని, ఇది శుభ పరిణామమన్నారు. అభిప్రాయ సేకరణ కోసమే తాము బిల్లును అసెంబ్లీకి పంపించామన్నారు. ఈ నెల 23వ తేదీ వరకు అభిప్రాయం చెప్పేందుకు సమయమిచ్చినట్లు తెలిపారు. పార్లమెంటు సమావేశాల్లో బిల్లు వస్తుందో రాదో తెలియదన్నారు.

కాగా, కేంద్రమంత్రులు కమల్ నాథ్, గులాం నబీ ఆజాద్లు కూడా తెలంగాణ అంశంపై వేర్వేరుగా బుధవారం స్పందించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి మొదటి వారంలో పార్లమెంటు సమావేశాలు ఉంటాయని, ఆ సమయంలో తెలంగాణ బిల్లు పెట్టే విషయమై ఇప్పుడే చెప్పలేమని కేంద్రమంత్రి కమల్ నాథ్ ఢిల్లీలో అన్నారు.
విభజన విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుందని, 2014 ఎన్నికల్లోగా ఎపిలో రెండు రాష్ట్రాలు ఏర్పడతాయని భావిస్తున్నానని, విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిందని, దాన్ని ఆమోదిస్తారో, వ్యతిరేకించి పంపిస్తారో మెజార్టీ సభ్యుల అభిప్రాయంపై పార్లమెంట్ నిర్ణయం తీసుకుంటుందని ఆజాద్ హైదరాబాదులో అన్నారు.
నెల రోజులుగా చూస్తున్నా అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ జరగడం లేదని, రాష్ట్రపతి ఇచ్చిన గడువు (23 తేదీ)లోగా అసెంబ్లీ తన అభిప్రాయం కేంద్రానికి పంపుతుందని ఆశిస్తున్నానన్నారు. అసెంబ్లీ తన అభిప్రాయాన్ని పంపాలని, గడువులోగా పంపుతారని భావిస్తున్నానని, దానిపై రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ తదుపరి నిర్ణయం తీసుకుంటుందన్నారు. అసెంబ్లీ నుంచి కేంద్రానికి బిల్లు వచ్చాక ప్రత్యేక పార్లమెంటు సమావేశాల గురించి ఆలోచిస్తామన్నారు.












Click it and Unblock the Notifications