కొలిజీయంపై మళ్లీ ఉపరాష్ట్రపతి కామెంట్స్-అసలు మనది ప్రజాస్వామ్య దేశమేనా ?
దేశంలో జడ్డీల నియామకం కోసం ప్రస్తుతం అమలు చేస్తన్న కొలీజియం వ్యవస్ధపై ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్కడ్ మరోసారి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. జడ్డీల నియామకం కోసం న్యాయ నియామకాల కమిషన్ అమల్లోకి రాకుండా సుప్రీంకోర్టు అడ్డుపడుతుందనే అర్ధం వచ్చేలా ఆయన మరోసారి కొలీజియం వ్యవస్ధపై విమర్శలు గుప్పించారు. అసలు మనం ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా అని ధన్కడ్ ప్రశ్నించారు.
రాజస్తాన్ లోని జైపూర్లో జరిగిన 83వ అఖిల భారత ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్లో ఉప రాష్ట్రపతి ధన్కడ్ ఆరంభ ఉపన్యాయం చేశారప. ఇందులో ఆయన మరోసారి న్యాయవ్యవస్థకు ఉన్న అధికారాల వివాదాన్ని లేవనెత్తారు. సుప్రీంకోర్టు 2015లో జాతీయ న్యాయ నియామకాల కమిషన్ నిర్ణయాన్ని కొట్టివేయడంపై ధన్కడ్ అభ్యంతరం తెలిపారు. రాజ్యసభలోనూ ఈ అంశాన్ని లేవనెత్తుతానని ఆయన వెల్లడించారు. రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని, కానీ మనం ప్రజాస్వామ్య దేశమా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పడం కష్టమని ధన్కడ్ వ్యాఖ్యానించారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యం.. సార్వభౌమాధికారం, స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటుందని.. ఇది రాజీపడటాన్ని ఎట్ట పరిస్దితుల్లోనూ అనుమతించదని ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య మనుగడకు అత్యవసరమన్నారు. న్యాయపరమైన ఉత్తర్వులు రాసే అధికారం చట్టసభలకు లేదు కాబట్టి.. కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థకు చట్టాలు చేసే అధికారం కూడా లేదన్నారు. తద్వారా జడ్డీల నియామకం కోసం పార్లమెంటు చేసిన చట్టాన్ని తిరస్కరించే అధికారం సుప్రీంకోర్టుకు లేదని పరోక్షంగా ధన్కడ్ తేల్చిచెప్పారు. దీంతో కొలీజియం వ్యవస్ధపై మరోసారి ఆయన అక్కసు వెళ్లగక్కినట్లయింది.