మహారాష్ట్రలో వర్ష బీభత్సం: బ్రిడ్జి కూలి 4 కార్లు, 2 బస్సులు గల్లంతు
ముంబై: మహారాష్ట్రలో వర్షం బీభత్సం కొనసాగుతోంది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఘోర ప్రమాదం సంభవించింది. భారీ వర్షాల కారణంగా మహారాష్ట్ర మహద్ వద్ద ముంబై-గోవా రహదారిలో సావిత్రి నదిపై ఉన్న బ్రిడ్జి కుప్పకూలింది.
ప్రమాద సమయంలో బ్రిడ్జిపై వెళుతున్న నాలుగు కార్లు, రెండు బస్సులు కొట్టుకుపోయాయి. రెండు బస్సుల్లో 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఈ ప్రమాదంలో 30 మంది గల్లంతైనట్లు సమాచారం. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని రాయగఢ్ జిల్లా కలెక్టర్, ఎస్పీలను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశించారు.
ముంబై నుంచి ప్రత్యేక అధికారుల బృందంఘటనాస్థలికి బయలుదేరింది. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. భారీ వర్షాల కారణంగా ముంబై-గోవా జాతీయ రహదారిపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. సావిత్రినదిపై రెండు బ్రిడ్జిలు ఉన్నాయి.
కూలిన బ్రిడ్జి బ్రిటీష్ కాలం నాటిదని అధికారులు తెలిపారు. పాత బ్రిడ్జి పక్కనే మరో కొత్త బ్రిడ్జి కూడా ఉంది. కొత్త బ్రిడ్జిపై నుంచి వెళ్లకుండా రెండు బస్సులు పురాతన బ్రిడ్జిపైకి ఎందుకెళ్లాయని అధికారులు ఆరాతీస్తున్నారు. రాయగఢ్ జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
బ్రిడ్జి కూలిన ఘటనపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
మహారాష్ట్రలో బ్రిడ్జి కూలిన ఘటనపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ స్పందించారు. భారీ వర్షాల కారణంగానే సావిత్రి నదిపై బ్రిడ్జి కూలిపోయిందని ఆయన తెలిపారు. ఆ బ్రిడ్జి బ్రిటిష్ కాలం నాటిదని ఆయన అన్నారు. ప్రమాదంలో మొత్తం 20 మంది గల్లంతయ్యారని, రెండు బస్సులు, రెండు కార్లు కొట్టుకుపోయాయని ఆయన తెలిపారు.
ప్రమాదంలో గల్లంతైన వారి కోసం కోస్టుగార్డ్ హెలికాప్టర్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోడీ తనకు ఫోన్ చేసి ప్రమాదం గురించి ఆరా తీశారని, కేంద్రం సాయాన్ని అందిస్తుందని పేర్కొన్నారని తెలిపారు.
మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా మహద్లోని ముంబై-గోవా రహదారిపై సావిత్రి నదిపై ఉన్న బ్రిడ్జి కూలిన ప్రమాదంలో 30 మంది గల్లంతైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.