Vijay Diwas 2021: 1971లో భారత ఆర్మీ ముందు మోకరిల్లిన పాక్ సైన్యం..బంగ్లాదేశ్కు విముక్తి
విజయ్ దివాస్ భారత్లో ఏటా డిసెంబర్ 16వ తేదీన జరుపుకుంటాం. 1971లో భారత్ - పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించింది. పాక్ అధీనంలో ఉన్న బంగ్లాదేశ్కు విముక్తి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో పాక్ తోక ముడిచింది. ఎట్టకేలకు బంగ్లాదేశ్కు పాకిస్తాన్ నుంచి విముక్తి లభించింది. బంగ్లాదేశ్ ఒక దేశంగా ఆవిర్భవించిందంటే ఇందుకు కారణం భారత్ అనే చెప్పాలి. ఈ యుద్ధంలో పాక్ ఆర్మీ భారత్కు దాసోహం కావడమే కాదు... నాడు తూర్పు పాకిస్తాన్గా పిలువబడే బంగ్లాదేశ్కు విముక్తి కలిగింది.
ఇక డిసెంబర్ 16వ తేదీ బంగ్లాదేశ్కు కూడా ఒక పండగ దినం. పాకిస్తాన్ అధీనం నుంచి స్వతంత్రదేశంగా తూర్పు పాకిస్తాన్ ఆవిర్భవించింది. బంగ్లాదేశ్గా రూపాంతరం చెందింది. అదే సమయంలో పాకిస్తాన్ను దెబ్బతీయడంలో భారత్ సత్తా చాటింది. ఈ విజయాన్ని భారత్ ఇప్పటికీ గర్వంగా చాటుకుంటుంది. రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత తొలి యుద్ధం ఇదే కావడం ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించడం అనేవి చరిత్రలో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయాయి. బంగ్లాదేశ్లో డిసెంబర్ 16వ తేదీన బిజాయ్ దిబాస్గా జరుపుకుంటారు.
1971 డిసెంబర్ 16వ తేదీన పాకిస్తాన్ దళాల అధినేత జనరల్ అమిర్ అబ్దుల్లా ఖాన్ న్యాజీ మరో 93వేల బలగాలతో భారత ఆర్మీ మరియు జనరల్ జగ్జీత్ సింగ్ అరోరా నేతృత్వంలోని ముక్తి బహినీ ముందు రామ్నా రేస్ కోర్సులో లొంగిపోయారు. ఇది ఢాకాలో ఉంది. దీన్నే ప్రస్తుతం సుహ్రవార్దీ ఉద్యాన్గా పిలుస్తున్నారు. ఏటా 16 డిసెంబర్న దేశ పౌరులు, సీనియర్ అధికారులు, విద్యార్థులు, యుద్ధ వీరులు ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఆనాడు యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు నివాళులు అర్పించి నాటి త్యాగాలను గుర్తు చేసుకుంటారు. పాకిస్తాన్ చెర నుంచి బంగ్లాదేశ్కు విముక్తి కల్పించే క్రమంలో పాక్ పై పోరాడి అమరులైన జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తారు.