విజయకాంత్కూ కోపమొచ్చింది, ఆసక్తికరంగా బ్యానర్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పైన అభ్యంతరకర ఆర్టికల్ రాసిన శ్రీలంక పైన డీఎండీకే అధ్యక్షులు, ప్రముఖ సినీ నటుడు విజయకాంత్ కూడా మండిపడ్డారు. ఈ ఆర్టికల్ను ఆయన తీవ్రంగా ఖండించారు. డీఎండీకే ఎన్డీయేలో భాగస్వామి. ఈ నేపథ్యంలో ఆయన ఆగస్టు 2న పలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లారు.
శ్రీలంక ఆర్టికల్ పైన తమిళ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని విజయకాంత్ అన్నారు. ఇలాంటి దురాఘాతాలను శ్రీలంక పునరావృతం చేయవద్దన్నారు. శ్రీలంకతో స్నేహబంధం పైన భారత్ సమీక్షించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.
కాగా, అధికార అన్నాడీఎంకేతో పాటు ప్రతిపక్ష డీఎంకే చీఫ్ కరుణానిధి, డీఎండీకే చీఫ్ విజయకాంత్, పీఎంకే వ్యవస్థాపకులు రాందాస్ తదితర తమిళ నేతలు శ్రీలంక ఆర్టికల్ పైన మండిపడ్డారు. దీంతో శ్రీలంక ఆ లెటర్ను తన వెబ్ సైట్ నుండి తొలగించింది.
మెట్టుపాలయంలో బ్యానర్
అభ్యంతరక ఆర్టికల్ నేపథ్యంలో కోయంబత్తూరుకు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మెట్టుపాలయంలో ఓ బ్యానర్ వెలిసింది. ఇది అందరినీ ఆకట్టుకుంటోంది. శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్ష తమిళనాడు సీఎం జయలలిత ముందు కిందకు వంగి, ఆమెకు నమస్కరిస్తున్నట్లుగా ఆ బ్యానర్ ఉంది. ఈ బ్యానర్ తమిళ భాషలో ఉంది.
'అమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. దయచేసి వదిలేయండి. నాకు జీవితం ప్రసాదించండి' అన్నట్లుగా అందులో ఉందట. ఈ బ్యానర్ 20 ఫీట్ X 10 ఫీట్ ఉంది. దీని పైన నగర అన్నాడీఎంకే నేతల పేర్లు ఉన్నాయి.