ఆడవారు నైట్ గౌన్లు వేసుకోవద్దు!: పొరపాటేనని తగ్గిన మహిళలు
ముంబై: మహారాష్ట్రలోని ఓ గ్రామంలో మహిళలు బహిరంగంగా నైట్ గౌనులు వేసుకోవడాన్ని నిషేధించారు. నేవీ ముంబై ఏరియాలోని రేబాలో సమీపంలోని గోతివ్లీ గ్రామానికి చెందిన కొందరు మహిళలు గ్రామంలో నిషేధం విధించారు. ఇది ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది.
ఇంటి బయట లేదా బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, యువతులు నైటీలు వేసుకోవద్దని ఆదేశించారు. దీనిని ధిక్కరిస్తూ ఎవరైనా నైట్ గౌనును బహిరంగ ప్రదేశాల్లో వేసుకుంటే రూ.500 జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటి బయట నైటీ వేసుకోవడం అసభ్యతగా వారు అభివర్ణించారు.
ఈ ఆదేశాలు జారీ చేసింది ఇంద్రయాణీ మహిళా మండల్. వీరు ఈ గ్రామానికి చెందిన వారు. ఇటీవలి కాలంలో ఇక్కడకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చి నివాసం ఉంటున్నారు.
ఈ మహిళా గ్రూపు గ్రామ కమిటీ నోటీసు బోర్డు పైన ఇందుకు సంబంధించిన నోటీసును అంటించింది. మహిళల నైట్ గౌనులకు సంబంధించిన అంశంపై సోమవారం రాత్రి ఈ నోటీసు అంటించింది. ఈ నోటీసుతో గ్రామంలో విభేదాలు, ఉద్రిక్తతలు తలెత్తాయి. దీనిని కొందరు వ్యతిరేకించారు.
ఈ డ్రెస్ కోడ్ అంశాన్ని పలువురు పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లారు. పోలీసులు ఈ విషయంలో జోక్యం చేసుకొని, నోటీసు బోర్డు పైన ఉన్న నోటీసును తొలగించారు. గ్రామంలో విభేదాలను, ఉద్రిక్తతలను తొలగించేందుకు పోలీసులు గ్రామస్తులతో భేటీ నిర్వహించారు.
కాగా, ఈ విషయం పైన ఆదేశాలు జారీ చేసిన మహిళా సంఘాలు వెనక్కి తగ్గాయి. తమ అభిప్రాయాలను ఎవరి పైన రుద్దమని చెప్పారు. మంగళవారం నాడు క్షమాపణ చెప్పారు.
కాగా, తాము మహిళల సెంటిమెంట్లను గౌరవిస్తామని, గత కొద్ది ఏళ్లుగా సమాజంలో మార్పులు వస్తున్నాయని అయితే, మన అభిప్రాయాలు ఒకరి పైన రుద్దవద్దని, చట్టం ప్రకారం నడుచుకోవాలని పోలీసులు సూచించారు. జరిమానా విధించడం ద్వారా తాము పొరపాటు చేశామని, అయితే, నైతికత ముఖ్యమని ఓ మహిళ చెప్పారు. తాము ఎవరిని కూడా డ్రెస్ కోడ్ విషయంలో బలవంతం చేయమని చెప్పారు.