విశాఖ టూ చెన్నై గంజాయి దందా.. చెన్నైలో కోటి రూపాయల విలువైన గంజాయి పట్టివేత
గంజాయి అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు,స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు, ఎక్సైజ్ అధికారులు గంజాయిని నిర్మూలించటానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నా, భారీ నిఘా పెట్టినా సరే గంజాయి అక్రమ రవాణా సాగుతూనే ఉంది. అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. నిత్యం వాహన తనిఖీలు చేస్తూ గంజాయి దందాను అడ్డుకుంటున్నా సరే గంజాయి మాఫియా తమ పని తాము చేసుకుపోతున్నారు.
తాజాగా విశాఖ గంజాయి చెన్నైలో పట్టుబడిన ఘటన చోటు చేసుకుంది. విశాఖపట్నం నుండి తిరువారూరు జిల్లా తిరుత్తురై పూండీకి కారులో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయల గంజాయిని చెన్నైలో ప్రత్యేక దళం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 150 కిలోల గంజాయి బండిళ్లు కారులో బయటపడినట్లుగా సమాచారం. దీని విలువ కోటి రూపాయలు ఉంటుందని తెలుస్తుంది. స్పెషల్ స్క్వాడ్ పోలీసులు పక్కా సమాచారంతో గంజాయి రవాణా చేస్తున్న కారును పట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ ఏజెన్సీ నుండి గంజాయి అక్రమంగా తరలిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు చెన్నై పోలీసులు ఆదివారం సాయంత్రం తిరుత్తురై పూండి రౌండ్ ఠాణా వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో అటుగా వచ్చిన కారును తనిఖీ చేయగా అందులో గంజాయి బయటపడింది. గంజాయిని స్వాధీనం చేసుకుని కారు డ్రైవర్ దుండిగల్ జిల్లా కనవాయ్ పట్టీకి చెందిన మహేశ్వరన్ ను అరెస్ట్ చేశారు. ఇక పోలీసుల తనిఖీలో కారులో మూడు నంబర్ ప్లేట్లు కూడా లభించినట్లు సమాచారం.
విశాఖ నుండి గంజాయి తెచ్చే క్రమంలో అక్కడ ఏపీ రిజిస్ట్రేషన్ నెంబర్ ను ఉపయోగించినట్టు డ్రైవర్ తెలిపారు. ఇక చెన్నై లోకి ఎంటర్ అయిన తరువాత నెంబర్ ప్లేట్ మార్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా చాప కింద నీరులా గంజాయి మాఫియా విస్తరిస్తూనే ఉంది. అంతరాష్ట్ర రవాణా సాగిస్తూనే ఉంది.