శశికళకు జైల్లో వీవీఐపీ సేవల నివేదిక, చిన్నమ్మ కథ క్లైమాక్స్, డీఐజీ రూపా దెబ్బతో ఏసీబీ!
బెంగళూరు: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వీకే శశికళ నటరాజన్ కు వీవీఐపీ సేవలు అందించిన ఇద్దరు అధికారుల మెడకు ఉచ్చు బిగుసుకుంటుంది. డీఐజీ రూపా దెబ్బతో వీకే శశికళ నటరాజన్ కు రాచమర్యాదలు చేసిన ఇద్దరు సీనియర్ అధికారులపై ఏసీబీ విచారణ మొదలైయ్యింది.
డీఐజీ రూపా దెబ్బ
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళ నటరాజన్ కు వీవీఐపీ సేవలు చేస్తున్నారని, నాలుగు ప్రత్యేక గదులు కేటాయించారని రూపా గత ఏడాది ఆరోపించారు. శశికళ, ఆమె బంధువులకు మాత్రమే వంట చెయ్యడానికి ప్రత్యేక గది కేటాయించారని డీఐజీ రూపా ఆరోపించారు.
రూ. 2 కోట్టు లంచం
శశికళకు వీవీఐపీ సేవలు చెయ్యడానికి, ప్రత్యేక గదులు కేటాయించడానికి ఆమె కుటుంబ సభ్యుల నుంచి జైళ్ల శాఖ సీనియర్ అధికారులు రూ. 2 కోట్లు లంచం తీసుకున్నారని ఆరోపిస్తూ డీఐజీ రూపా గత ఏడాది జులైలో అప్పటి జైళ్ల శాఖ డీఐజీ సత్యనారాయణ రావ్ కు లేఖ రాశారు.
మీడియా దెబ్బతో రచ్చ
డీఐజీ రూపా శశికళ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెలుతూ లేఖ రాయడం, ఆ విషయం లీక్ అయ్యి మీడియాలో ప్రచారం కావడంతో దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. కర్ణాటక పోలీసు శాఖలో శశికళ విషయంపై రచ్చరచ్చ అయ్యింది.
వినయ్ కుమార్ కమిటి
డీఐజీ రూపా సాక్షాలతో సహ మీడియా ముందుకు రావడంతో సీరియస్ అయిన ప్రభుత్వం ఆమెను జైళ్ల శాఖ నుంచి ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేసింది. అక్కడి నుంచి మళ్లీ బదిలి కావడంతో ఇప్పుడు హోం శాఖ డీఐజీగా ఉన్నారు. రూపా ఆరోపణలపై విచారణ చెయ్యాలని ప్రభుత్వం వినయ్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది.
చిన్నమ్మ శశికళ దర్బారు
రూపా ఆరోపణలు చేసిన తరువాత శశికళ, ఆమె వదిన ఇళవరసి సాధారణ దుస్తుల్లో బయట నుంచి జైలు లోపలికి వెలుతున్న సీసీటీవీ పుటేజీలు మీడియాకు లీక్ అయ్యాయి. ఈ దెబ్బతో కర్ణాటక ప్రభుత్వంతో పాటు జైళ్ల శాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు. జైల్లోని సీసీటీవీ పుటేజీలు ఎలా బయటకు వచ్చాయి అని ఆరా తీశారు.
ఏసీబీ విచారణ
వినయ్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లోని ఖైదీలు, సిబ్బందిని విచారణ చేశారు. జైల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. అందరినీ విచారణ చేసి పలు విషయాలు సేకరించి ప్రభుత్వానికి ఇటీవల నివేదిక సమర్పించారు.
ఏసీబీకి రూపా వివరణ
గత ఏడాది ఆగస్టు 19వ తేదీన ఏసీబీ అధికారులకు డీఐజీ రూపా వివరణ ఇచ్చారు. శశికళకు ఎవరెవరు సహాయం చేశారు, జైల్లో ఆమెకు రాచమర్యాదలు చెయ్యడానికి ఎవరు సహకరించారు, లంచం ఎలా వచ్చింది అనే పూర్తి సమాచారం ఉన్న నివేదికను డీఐజీ రూపా ఏసీబీ అధికారులకు సమర్పించారు.
సీఎం సిద్దూ గ్రీన్ సిగ్నల్
వినయ్ కుమార్ కమిటీ సమర్పించిన నివేదిక పరిశీలించిన సీఎం సిద్దరామయ్య నేతృత్వంలోని మంత్రి వర్గం శశికళ రాచమర్యాదల విషయంలో విచారణ చెయ్యాలని ఏసీబీ అధికారులను ఆదేశించారని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
ఇద్దరి మెడకు ఉచ్చు
జైళ్ల శాఖలోని ఇద్దరు సీనియర్ అధికారుల ప్రమేయంతోనే శశికళకు జైల్లో వీవీఐపీ సేవలు చేశారని, ఆమె జైలు నుంచి ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్లారని వెలుగు చూడటంతో అవినీతి నిరోదక దళం (ఏసీబీ) అధికారులు రంగంలోకి దిగారు.
శశికళ కథ క్లైమాక్స్
జైల్లో వీవీఐపీ సేవలు చేయించుకున్నారని, జైలు నుంచి బయటకు వెళ్లి వచ్చారని శశికళ మీద నేరం రుజువు అయితే ఆమెకు మరన్ని కష్టాలు మొదలౌతాయని అధికారులు అంటున్నారు. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన శశికళకు మరింత శిక్షపడే అవకాశం ఉందని, సాధారణ శిక్ష కాకుండా కఠిన శిక్ష పడే అవకాశం ఉంటుందని న్యాయనిపుణలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.