రైలు మిస్సయిందా? నో ప్రాబ్లం.. ఏ రైలైనా ఎక్కొచ్చు, రైల్వేశాఖ కొత్త పథకం
రైల్వే శాఖ కొత్త పథకం ప్రకారం... నిరీక్షణ జాబితా(వెయిటింగ్ లిస్ట్)లో ఉన్న ప్రయాణికులకు అదే మార్గం గుండా వెళ్లే తరువాతి ప్రత్యామ్నాయ రైళ్లలో బెర్తులు కేటాయించనున్నారు.
న్యూఢిల్లీ: మెయిల్, ఎక్స్ ప్రెస్ లాంటి సాధారణ రైళ్లలో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఏప్రిల్ 1 నుంచి రాజధాని, శతాబ్ధి రైళ్లలో ప్రయాణించవచ్చు. రైల్వే శాఖ కొత్త పథకం ప్రకారం... నిరీక్షణ జాబితా(వెయిటింగ్ లిస్ట్)లో ఉన్న ప్రయాణికులకు అదే మార్గం గుండా వెళ్లే తరువాతి ప్రత్యామ్నాయ రైళ్లలో బెర్త్ లు కేటాయించనున్నారు.
అయితే రెండింటి మధ్య తేడాలుంటే ప్రయాణికుడి నుంచి ఎలాంటి రుసుములు తీసుకోరు, అలాగే ప్రయాణికుడికి రిఫండ్ కూడా చేయరు. 'వికల్ప్'గా పిలిచే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలంటే టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ప్రయాణికుడు దీనిని ఎంచుకోవాల్సి ఉంటుంది.
ప్రత్యామ్నాయ రైలులో సీటు ఖరారైన తరువాత ప్రయాణికుడి మొబైల్ ఫోన్ కు ఎస్సెమ్మెస్ వస్తుంది. ప్రధాన మార్గాల్లో రైళ్లు రాజధాని, శతాబ్ధి, దురంతో, సువిధ లాంటి వాటిలో ఖాళీగా మిగులున్న బెర్త్ లను నింపడమే లక్ష్యంగా ఈ కొత్త పథకాన్ని చేపడుతున్నారు.
ఈ పథకం ప్రయాణికుల అనుకూల చర్య అని, నిరీక్షణ జాబితాలో ఉన్న వారికి సీటు ఖరారు చేయడంతోపాటు, అందుబాటులో ఉన్న బెర్త్ లను సద్వినియోగం చేసుకోవాలనే జంట లక్ష్యాలు దీంతో నెరవేరతాయని రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
పలు కారణాలతో టికెట్ల రద్దు వల్ల రైల్వే శాఖ ఏటా రిఫండ్ రూపంలో రూ.7500 కోట్లు కోల్పోతోంది. ఫ్లెక్సీ-ఫేర్ విధానాన్ని ప్రవేశపెట్టిన తరువాత ప్రీమియం రైళ్లలో కొన్ని బెర్తులు ఖాళీగా ఉంటున్నాయి.
అదే సమయంలో మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లలో డిమాండ్ అధికంగా ఉండటంతో చాలా మందికి బెర్త్ లు దొరకడం లేదు. ఢిల్లీ-లక్నో, ఢిల్లీ-జమ్మూ, ఢిల్లీ-ముంబై లాంటి మార్గాల్లో నవంబర్ 1 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.