కరోనాపై ఢిల్లీ హర్యానా మంత్రుల మధ్య మాటలయుద్ధం.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆసక్తికర స్పందన ఇదే!!
కరోనా కేసుల విషయంలో ఢిల్లీ హర్యానా రాష్ట్రాల మంత్రుల మధ్య వార్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతో విరుచుకుపడుతున్నారు. కోవిడ్-19 కేసులు పెరగడానికి ఢిల్లీనే కారణమని ఢిల్లీని ఆనుకొని ఉన్న మూడు రాష్ట్రాలలో కేసులు ఎక్కువగా వస్తున్నాయని, ఢిల్లీ సర్కార్ కరోనా కేసులను నియంత్రించటంలో విఫలమైందని హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇక అనిల్ విజ్ చేసిన ఆరోపణలకు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఇక తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు.
కరోనా విషయంలో ఢిల్లీపై ఆరోపణలు చేసిన హర్యానా మంత్రి
హర్యానాలో ప్రతిరోజూ దాదాపు 9,000 కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. వాటిలో 50 శాతానికి పైగా కేసులు గురుగ్రామ్, ఫరీదాబాద్ మరియు సోనిపట్ నుండి నమోదవుతున్నాయని హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ పేర్కొన్నారు. ఢిల్లీ యొక్క ఇన్ఫెక్షన్ రేటు హర్యానా రాష్ట్రంలో ప్రభావం చూపుతోందని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని మూడు జిల్లాల్లో కోవిడ్ కేసులు పెరగడానికి ఢిల్లీ కారణం అంటూ హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ జాతీయ రాజధాని ఢిల్లీపై ఆరోపణలు చేశారు.
అనిల్ విజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఉద్దేశించినవన్న ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్
అయితే అనిల్ విజ్ వ్యాఖ్యలకు కౌంటర్ గా ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రి సత్యేందర్ జైన్ ఢిల్లీ సరిహద్దుల వెలుపల నుండి ప్రజలు ఢిల్లీకి రావడం వల్ల ప్రతిరోజూ 1,000 బయట కేసులే ఢిల్లీలో నమోదవుతున్నాయని చెప్పారు. అనిల్ విజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఉద్దేశించినవని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో ఎంతమంది హర్యానా ప్రజలు కోవిడ్ బారిన పడుతున్నారో తాము కూడా చెప్పగలమని ఆయన వెల్లడించారు. హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ రాష్ట్రంలోని మూడు జిల్లాలలో అధిక కోవిడ్ ఇన్ఫెక్షన్ రేటుకు "దేశ రాజధానిలో కేసులు అనియంత్రిత పెరుగుదల" కారణమని చెప్పారు.
ఒకరిని ఒకరు నిందించటం వల్ల కరోనా అంతం కాదన్న అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీకి సమీపంలో ఉన్నందున హర్యానా కరోనా మహమ్మారికి ప్రతికూలంగా ప్రభావితమైందని, అయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ వ్యవహారంపై ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. తాజాగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఒకరిని ఒకరు నిందించడం వల్ల కరోనా వైరస్ అంతం కాదు, నేను ఈ చెత్త వివాదంలోకి అడుగు పెట్టను అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
కరోనా పై ఢిల్లీ వర్సెస్ హర్యానా
ఢిల్లీలో ఆదివారం 18,286 కోవిడ్ -19 కేసులు మరియు 28 మరణాలు నమోదయ్యాయి. అయితే ఆరోగ్య శాఖ డేటా ప్రకారం, సానుకూలత రేటు ఒక రోజు క్రితం 30.64 శాతం నుండి 27.87 శాతానికి పడిపోయింది. హర్యానాలో ఆదివారం 8,900 కోవిడ్ కేసులు మరియు ఆరు మరణాలు నమోదయ్యాయి. ఏదిఏమైనా కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మాటల యుద్ధం చేసే బదులు, కరోనా కట్టడికి ఏం చేయాలో అది చేస్తే బాగుంటుందని రెండు రాష్ట్రాల ప్రజలు అంటున్నారు ఆరోపణలు, ప్రత్యారోపణలు కట్టిపెట్టి కరోనా మహమ్మారిని నియంత్రించే చర్యలను చేపట్టాలని సూచిస్తున్నారు.