'నా భార్య తప్పు చేసింది': జేగంట కొడుతూ భర్త ప్రచారం.. ఒడిశాలో ఆటవికం..
'నా భార్య తప్పు చేసింది' అని జేగుంట కొడుతూ ఊరంతా ప్రచారం చేయాలని ఆమె భర్తను ఆదేశించారు.
ఒడిశా: దేశంలోని చాలా గ్రామాల్లో ఇంకా కాప్ పంచాయితీల తరహా వ్యవహారమే రాజ్యమేలుతోంది. వ్యక్తుల స్వేచ్చను, హక్కులను కాలరాస్తూ.. తమకు నచ్చిన రీతిలో కొన్ని గ్రామ పంచాయితీలు తీర్పులు ఇచ్చేస్తున్నాయి. హర్యానాలో ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తుండగా.. తాజాగా ఒడిశాలోను ఈ తరహా ఘటన చోటు చేసుకుంది.
ఒడిశాలోని అనుగుల్ జిల్లా రగుడిపడాలో పంచాయితీ పెద్దలంతా కలిసి ఓ గ్రామ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవలి పంచాయితీ ఎన్నికల్లో తాము సూచించిన అభ్యర్థికే ఓటేయాలని గ్రామస్తులందరికి హుకుం జారీ చేశారు. ఈ హుకుంను ఉల్లంఘించి మల్లికా సాహు అనే మహిళ వేరే అభ్యర్థికి ఓటు వేసింది. దీంతో ఆగ్రహించిన గ్రామ కమిటీ ఆమెకు శిక్ష విధించింది.
అయితే సకాలంలో ఆమె జరిమానా చెల్లించకపోవడంతో గురువారం నాడు గ్రామ కమిటీ సభ్యులు మరో ఆటవిక శిక్ష విధించారు. 'నా భార్య తప్పు చేసింది' అని జేగుంట కొడుతూ ఊరంతా ప్రచారం చేయాలని ఆమె భర్తను ఆదేశించారు. గ్రామ పెద్దల నిర్ణయానికి ఎదురు తిరగలేక.. సాహు వాళ్లు చెప్పినట్లు చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను శిక్షించేందుకు సిద్దమవుతున్నారు.