మేం దేనికైనా సిద్ధమే..డ్రాగన్ సైన్యం వెనక్కు వెళ్ళటంపై స్పందించిన ఇండియన్ ఆర్మీ చీఫ్ నరవణే
లడఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి 150 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల పరిధిలోని సాంప్రదాయ శిక్షణా ప్రాంతాల నుండి చైనా పదివేల మంది సైనికులు వెనక్కి తరలించిన సమాచారం ఇప్పుడు అందరిని ఆలోచించేలా చేస్తోంది. అయితే చైనా వెనక్కి తగ్గిందా అన్నదానిపై ఎలాంటి ఉద్దేశాన్ని మనం ఆశించలేం అని భారత ఆర్మీ చీఫ్ అన్నారు . ఇప్పటికీ చైనా , ఇండియా సరిహద్దు వివాదంలో ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ అలెర్ట్ గానే ఉన్నామని ఆయన భారత్ ఆర్మీ చీఫ్ నరవాణే తెలిపారు.
చైనా సైనికులను తగ్గించిన వార్తలపై స్పందించిన ఆర్మీ చీఫ్ నరవాణే
ఉష్ణోగ్రతలు మైనస్ 30 డిగ్రీలకు పడిపోయినప్పటికీ , గాలిలో ఆక్సిజన్ స్థాయి లో పడిపోయినా కూడా పాంగాంగ్ సరస్సు , చూషుల్ , గోగ్రా హాట్స్ప్రింగ్స్, దెప్సాంగ్ మైదానాలలో మాత్రం పరిస్థితి ఎప్పటిలాగే ఉంది. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పేర్కొన్నారు . తూర్పు లడఖ్లో చైనా సమీకరణ గురించి భారత్కు తెలుసు, కాని మేము వారి ఉద్దేశాలను ఊహించలేమని పేర్కొన్నారు .
ఫ్రంట్ లైన్ ప్రాంతాలలో విస్తరణ అలాగే ఉందన్న ఆర్మీ చీఫ్
తూర్పు లడఖ్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఐసి) నుండి 80-100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చైనా తన శిక్షణా సదుపాయాల నుండి 10,000 మంది సైనికులను తరలించినట్టు వార్తలు వచ్చిన తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు .ఇది యుద్ధం నుండి విరమించే సంకేతం అని తాము అనుకోవటం లేదని స్పష్టం చేశారు . ఏదేమైనా, ఈ ప్రాంతంలోని ఫ్రంట్లైన్ ప్రాంతాలలో విస్తరణను తగ్గించలేదని యధావిదిగా కొనసాగుతుందని తెలుస్తుంది . టిబెట్ పీఠభూమిలో ఉన్న పీఎల్ఏ దళాలు వెనక్కి వెళ్లడం మంచి పరిణామమే కానీ ఘర్షణాత్మక ప్రాంతాల్లో.. చైనా వైపు కానీ, మన వైపు కానీ దళాల సంఖ్య తగ్గలేదన్నారు నరవాణే.
చలి కారణంగా కొన్ని ప్రాంతాలలో ట్రూప్స్ తగ్గించిన చైనా
భారత్, చైనా మధ్య చర్చలు సమగౌరవంతో సాగాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. సరిహద్దు సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. లోతైన ప్రాంతాలలో ఉన్న వారి శిక్షణా ప్రాంతాలు చలి కారణంగా ఖాళీ చేయించినా కానీ ఘర్షణలకు సంబంధించి కొనసాగుతున్న ప్రతిష్టంభన అలాగే కొనసాగుతుందని పేర్కొన్నారు.
తాము చైనాకు వ్యతిరేకంగా గట్టిగా ఫైట్ చేస్తామని , చర్చలు కొనసాగుతాయని ప్రభుత్వం చెప్పిందని ఆయన మీడియాకు తెలియజేశారు. చైనా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిన ఎల్ఏసి యొక్క మధ్య మరియు తూర్పు రంగాలలో పటిష్టమైన నిఘా కొనసాగుతుందని చెప్పారు.
చైనా సైన్యం వెనక్కు వెళ్ళటం లెక్కలోని అంశం కాదన్న నరవాణే
ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ, ఈ శిక్షణా ప్రాంతాలలో చైనా సైనికుల ఉనికిని లేదా వారు అక్కడనుండి వెళ్లిపోవడాన్ని మనం ఎక్కువగా లెక్కలోకి తీసుకోకూడదని , 48 గంటల్లో చైనీయులు తిరిగి కావాల్సిన సైన్యాన్ని సమీకరించగల సామర్ధ్యం ఉన్నవారని అన్నారు. భారత సైన్యం ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి మాట్లాడుతూ, 2020 లో అతిపెద్దవి చైనా మరియు కోవిడ్ -19. పాకిస్తాన్తో కలిసి చైనా భారీగా ముప్పుకు ప్లాన్ చేసిందని ఆయన అన్నారు. అయితే సైనిక, మిలటరీయేతర రంగాలలో ఇరు దేశాల మధ్య సహకారం పెరిగిందని ఆయన అన్నారు.