కేవలం 17 నిమిషాల్లో బాబ్రీ మసీదును కూల్చేశాం: శివసేన షాకింగ్ కామెంట్స్
ముంబై: అయోధ్యలోని బాబ్రీ మసీదును కేవలం 17 నిమిషాల్లో కూల్చేశామని, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిరం కట్టడానికి ఇంకా ఎన్ని రోజులు తీసుకుంటారని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.
ఇటీవల శివసేన పత్రిక సామ్నాలో రామమందిరం నిర్మాణం గురించి కేంద్రాన్ని ప్రశ్నించారు. ఆలయ నిర్మాణానికి ఆర్డినెన్స్ ఎందుకు తీసుకు రావడం లేదని ప్రశ్నించారు. మరోవైపు, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ఈ నెల 25వ తేదీన అయోధ్యకు వెళ్తున్నారు.
ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. అయోధ్యలో రాముడి ఆలయం నిర్మించాల్సిందేనని చెప్పారు. ఆలయాన్ని నిర్మిస్తామని గత ఎన్నికల్లో తాము హామీ ఇచ్చామని చెప్పారు. ఉత్తర ప్రదేశ్లో, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, అయినప్పటికీ రామాలయ నిర్మాణంలో జాప్యం ఎందుకు జరుగుతోందని నిలదీశారు.
మసీదును కూల్చేందుకు రామభక్తులకు 17 నిమిషాల సమయం తీసుకుందని, ఆలయాన్ని నిర్మించేందుకు ఏళ్లకు ఏళ్లు ఎందుకు తీసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. సంజయ్ రౌత్ వ్యాఖ్యలు రాజకీయాల్లో వేడిని రాజేశాయి.