కేజ్రీవాల్కు ఊరట: ఏఏపీ ఫండ్స్పై మోడీ ప్రభుత్వం క్లీన్ చిట్
న్యూఢిల్లీ: విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి విరుద్ధంగా ఆమ్ ఆద్మీ పార్టీ విదేశీ విరాళాలు స్వీకరించిందన్న ఆరోపణలలో వాస్తవం లేదని కేంద్ర హోంశాఖ ఢిల్లీ హైకోర్టుకు బుధవారం తెలిపింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ జి రోహిణి, జస్టిస్ ఆర్ఎస్ ఎండ్లాల ధర్మాసనానికి ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరించారు.
ఏఏపీ చట్టాన్ని ఉల్లంఘించినట్లు నిఘా విభాగం నివేదిక పేర్కొనలేదన్నారు. తాము విచారణ జరిపించామని, అక్రమాలు ఉన్నట్లుగా వెల్లడి కాలేదని తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా దీనిపై తీవ్రస్థాయిలో రగడ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై తాజా నివేదిక సమర్పించాల్సిందిగా ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆ నివేదిక అందిన తర్వాత అన్ని వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయానికి వస్తామని తెలిపింది. అప్పటిదాకా ఏఏపీ విదేశీ విరాళాలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంమీద తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ పైన తప్పుడు ఆరోపణలు చేసినందుకు బీజేపీ క్షమాపణలు చెప్పాలని ఏఏపీ డిమాండ్ చేసింది.

సీఎం కేజ్రీవాల్ తొలి జనతా దర్బార్
ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేజ్రీవాల్ బుధవారం తొలి జనతా దర్బార్ నిర్వహించారు. ఘజియాబాద్లోని పార్టీ కార్యాలయంలో జనతా దర్బార్లో భాగంగా ఆయన ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 200 మంది ప్రజలు పాల్గొన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ సచివాలయంలోనూ సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు కేజ్రీవాల్ జనతా దర్బార్ నిర్వహించారని ఆ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications