బెంగాల్లో నేడే నాలుగో విడత పోలింగ్... 44 అసెంబ్లీ నియోజకవర్గాలు... బరిలో 373 మంది అభ్యర్థులు...
పశ్చిమ బెంగాల్లో శనివారం(ఏప్రిల్ 10) నాలుగో విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కూచ్ బెహార్,అలీపుర్దువర్,హౌరా,హుగ్లితో పాటు దక్షిణ 24 పరగణాలు,సౌత్ బెంగాల్,నార్త్ బెంగాల్లోని పలు జిల్లాల్లో కలిపి మొత్తం 44 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గాల్లో మొత్తం 373 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 1,15,81,022 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
నాలుగో విడతలో పోలింగ్ జరగనున్న 44 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 4 మినహా మిగతావన్నీ టీఎంసీ సిట్టింగ్ స్థానాలే. ఒకరకంగా ఈ స్థానాలన్నీ టీఎంసీ కంచుకోటలుగా చెబుతారు. ఈ నేపథ్యంలో టీఎంసీ కంచుకోటల్లో ఈసారి కూడా ఆ పార్టీ హవానే నడుస్తుందా.. లేక ఓటర్లు బీజేపీకి అవకాశం ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.నాలుగో విడతలో పోటీ చేస్తున్న ప్రముఖ నేతల్లో కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో సహా బీజేపీ ఎంపీలు లాకెట్ ఛటర్జీ,నిశిత్ ప్రామాణిక్,బెంగాల్ మంత్రులు పార్థా ఛటర్జీ,అరూప్ బిశ్వాస్ ఉన్నారు.
పోలింగ్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. మొత్తం 15,940 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సీఏపీఎఫ్ నుంచి 789 కంపెనీల భద్రతా బలగాలను పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించారు.
నాలుగో విడతలో బరిలో ఉన్న అభ్యర్థుల్లో టీఎంసీ నేత అహ్మద్ జావెద్ ఖాన్ రూ.32.33కోట్లతో అందరి కన్నా సంపన్న నేతగా ఉన్నారు. భాన్గర్ నుంచి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి నౌషర్ అలీ మొల్లా తన ఆస్తులు కేవలం రూ.500గా ప్రకటించారు. ఆస్తుల పట్టికలో అందరి కన్నా ఆయనే దిగువన ఉన్నారు. పోటీలో ఉన్న 373 మంది అభ్యర్థుల్లో 81 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో వామపక్ష అభ్యర్థి మీర్జా హాసన్పై అత్యధికంగా 19 కేసులున్నాయి. కాగా,బెంగాల్లో మొత్తం 8 దశల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మే 2న ఫలితాలు వెల్లడి కానున్నాయి. బెంగాల్ గడ్డపై ఎలాగైనా జెండా పాతేందుకు బీజేపీ సర్వ శక్తులు ఒడ్డుతోంది. అటు అధికార టీఎంసీ కూడా బీజేపీని అడ్డుకునేందుకు శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తోంది. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.