వాపును చూసి: రెండేళ్లలో దారుణంగా బీజేపీ ఓట్లశాతం: పోరాడితే పోయేదేమీ లేదంటారు గానీ
కోల్కత: సరిగ్గా రెండేళ్ల కిందట- పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్య ఫలితాలను అందుకుంది. 2019 నాటి లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కు షాక్ల మీద షాక్లు ఇచ్చింది. 42 లోక్సభ నియోజకవర్గాలు ఉన్న పశ్చిమ బెంగాల్లో ఎవరూ ఊహించని విధంగా ఏకంగా 18 స్థానాలను దక్కించుకుంది. తన ఓట్ల శాతాన్ని, ఓటుబ్యాంకును భారీగా పెంచుకోగలిగింది. 2014 నాటి సాధారణ ఎన్నికలతో పోల్చుకుంటే- లోక్సభ స్థానాల సంఖ్యను, ఓటింగ్ షేర్ను పెంచుకోగలిగింది. తృణమూల్ కోటలో పాగా వేసినట్టేనని భావించింది. అదే జోరును అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగించేలా యాక్షన్ ప్లాన్ను రూపొందించుకుంది.

రెండేళ్లు తిరిగే సరికి..
రెండేళ్లు తిరిగే సరికి- బెంగాల్ పువ్వుల ముందు కమలం వసి వాడింది. కమలనాథుల ముఖాలు కళ తప్పాయి. అంచనాలు తలకిందులయ్యాయి. వేసుకున్న ప్రణాళికలు..పకడ్బందీగా రూపొందించుకున్నామని భావించిన వ్యూహాలు బెడిసి కొట్టాయి. ఓట్లను పెంచుకున్నట్టుగా కనిపించినప్పటికీ.. అది బలం కాదని తేలింది. వాపు అని మాత్రమే నిరూపితమైంది. జనం పల్స్ను పట్టలేకపోయామని బీజేపీ నేతలు గ్రహించేటప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అసెంబ్లీ సీట్లను పెంచుకోగలిగిందే తప్ప.. అధికారానికి సుదూరంలో నిలిచిపోయింది.
పోరాడితే పోయేదేమీ లేదంటారు గానీ..
2019 సార్వత్రిక ఎన్నికల్లో 40.7 శాతం ఓట్లను సాధించింది బీజేపీ. 18 లోక్సభ స్థానాల్లో కాషాయ జెండాను ఎగరేయగలిగింది. తృణమూల్ కాంగ్రెస్కు ధీటైన ప్రత్యర్థిగా నిలిచింది. ఆ ఎన్నికల్లో తృణమూల్కు 43.3 శాతం మేర ఓట్లు పోల్ అయ్యాయి. ఈ రెండు పార్టీల మధ్య ఉన్న ఓట్ల శాతానికి పెద్దగా తేడా ఏదీ లేకపోవడంతో- కాస్త గట్టిగా పోరాడితే అసెంబ్లీలో పాగా వేయగలమని బీజేపీ భావించింది. దానికి అనుగుణంగా కసరత్తు చేసింది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి చాలా కాలం నుంచే బెంగాల్లో ప్రచార కార్యక్రమాలను చేపట్టింది.

రెండు శాతం మేర తగ్గిన ఓటింగ్..
2019 నాటి లోక్సభ ఎన్నికలతో పోల్చుకుంటే- బీజేపీకి పోల్ అయిన ఓట్ల శాతంలో రెండు శాతం మేర క్షీణత కనిపించింది. అప్పట్లో 40.7 శాతం మేర నమోదైన బీజేపీ ఓట్ల శాతం ఈ సారి 38.09కి పడిపోయింది. అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ ఓట్ల శాతం భారీగా పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే అయిదు శాతం మేర పెరిగింది. 43.3 శాతం నుంచి 47.97కు చేరింది. ఈ పరిణామాలు బీజేపీకి దిగ్భ్రాంతిని కలిగించేవే అనడంలో సందేహాలు అనవసరం. గెలుస్తామని ఆశించినా.. గెలవడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన చోట.. తన రాజకీయ ప్రత్యర్థి ఓట్ల శాతాన్ని, ఇదివరకటి కంటే అసెంబ్లీ సీట్ల సంఖ్యనూ పెంచుకోగలిగిందంటే.. అది దారుణ పరాజయం కిందే లెక్క.

214 వద్ద
తృణమూల్ కాంగ్రెస్ తన సీట్ల సంఖ్యనుకొద్దిగా పెంచుకోగలిగింది. ఇదివరకు ఆ పార్టీకి 211 సీట్లు ఉండగా.. ఆ సంఖ్య 214కు చేరింది. ఒక్క స్థానానికి సంబంధించిన ఫలితం ఇంకా వెలువడాల్సి ఉంది. 292 సీట్లు ఉన్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీకి దగ్గిన సీట్లు76. ఇతరులు ఒకచోట, లెఫ్ట్ పార్టీలు మరోచోట విజయం సాధించాయి. ఈ ఎన్నికల తరువాత బెంగాల్లో బలపడటానికి బీజేపీ ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తుందనేది ఆసక్తిని రేపుతోంది.












Click it and Unblock the Notifications