బెంగాల్ పోరు .. తొలి విడత పోల్స్ కు పీఎం మోడీతో సహా బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు వీరే
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచార హోరాహోరీగా సాగుతుంది. నువ్వా నేనా అన్నట్టు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలు తలపడుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, 200కు పైగా స్థానాలలో బీజేపీ పాగా వేస్తుందని బిజెపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బిజెపిని రాష్ట్రంలో కాలు పెట్టినిచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు.
మొదటి దశ ఎన్నికల కోసం బీజేపీ 40 మంది ప్రముఖుల ప్రచారకుల జాబితా
యుద్ధప్రాతిపదికన ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. మాటల తూటాలను పేలుస్తూ విరుచుకుపడుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుండి కీలకంగా వ్యవహరిస్తున్న నేతలను ఆపరేషన్ ఆకర్ష్ అంటుంది. ఎన్నికల సమయంలో మమతా బెనర్జీకి ఊహించని షాక్ లిస్తూ బిజెపి సైతం జోరుగా ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతుంది.
ఇదిలా ఉంటే ఎనిమిది దశల్లో జరగనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో మొదటి దశ ఎన్నికల కోసం బీజేపీ 40 మంది ప్రముఖుల ప్రచారకుల జాబితాను విడుదల చేసింది.

తొలి జాబితాలో పీఎం మోడీ, బిజెపి చీఫ్ జెపి నడ్డా, హోంమంత్రి అమిత్ షాలతో పాటు మంత్రులు
బిజెపి తరఫున మొదటి దశ ఎన్నికల ప్రచారం కోసం వీరు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం నిర్వహిస్తారు . బిజెపి విడుదల చేసిన తొలి జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బిజెపి చీఫ్ జెపి నడ్డా, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి బీజేపీ హేమాహేమీలు ఉన్నారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలకు బీజేపీ పార్టీ ప్రచారంలో రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, అర్జున్ ముండా, ధర్మేంద్ర ప్రధాన్, స్మృతి ఇరానీ లు కూడా పాల్గొననున్నారు .

ప్రచారాన్ని హోరెత్తించనున్న బీజేపీ అగ్ర నాయకులు
అంతే కాదు కైలాష్ విజయవర్గియా, శివప్రకాష్, ముకుల్ రాయ్, దిలీప్ ఘోష్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్, పశ్చిమ బెంగాల్లో నివసిస్తున్న బిహారీ ఓటర్ల ఓటు బ్యాంకు కోసం మనోజ్ తివారీ ప్రచారం చేయనుండగా, మహాభారత సీరియల్లో ద్రౌపది పాత్ర పోషించడం ద్వారా ప్రాచుర్యం పొందిన బిజెపి నాయకురాలు రూప గంగూలీ కూడా పార్టీ కోసం ప్రచారం చేయనున్నారు.
మార్చి 27వ తేదీన మొదటి దశ ఎన్నికల పోలింగ్ జరగనుండగా ఎన్నికల పోలింగ్ జరగనున్న నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున ప్రచారానికి బీజేపీ సిద్ధమవుతోంది.

ఐదు జిల్లాలలో 30 అసెంబ్లీ నియోజకవర్గాలు ; మమతకు చెక్ పెట్టేందుకు రంగంలోకి బీజేపీ
పశ్చిమ బెంగాల్ లో జరుగనున్న తొలి దశ ఎన్నికలలో, ఐదు జిల్లాలలో 30 అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ నెల 27 న ఎన్నికలకు వెళ్తాయి. ఈ 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడానికి బిజెపి స్టార్ క్యాంపెయినర్స్ రంగంలోకి దిగనున్నారు.
పశ్చిమ బెంగాల్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవటానికి , అలాగే మమతా బెనర్జీకి చెక్ పెట్టటానికి బీజేపీ పెద్ద సైన్యాన్నే దించింది . ఇక ఎన్నికల్లో బీజేపీ నేతల ప్రచార ప్రభావం ఏ మేరకు ఉంటుందో వేచి చూడాలి .












Click it and Unblock the Notifications