వాట్ ఎ జిమ్మిక్ మోడీ జీ..!!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి కేంద్రీయ దర్యాప్తు సంస్థ.. సీబీఐ అధికారులు మరోసారి షాక్ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు లుక్ అవుట్ సర్కులర్ను జారీ చేశారు. ఆయన నివాసంలో సోదాలను నిర్వహించిన రెండో రోజే సీబీఐ అధికారులు ఈ సర్కులర్ ఇచ్చారు. ఎక్సైజ్ కమిషన్ అరవ గోపీకృష్ణ సహా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీతో ప్రమేయం ఉన్న వారందరికీ అవి అందాయి.
ఎఫ్ఐఆర్ ఒక్కటే కాదు..
మనీష్ సిసోడియా, అరవ గోపీకృష్ణ, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఆనంద్ తివారి, అసిస్టెంట్ కమిషనర్ పంకజ్ భట్నాగర్తో పాటు 10 మంది లిక్కర్ లైసెన్స్దారులపై సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిలో కొందరికి ఈ ఉదయం లుక్ అవుట్ సర్కులర్ను జారీ చేశారు. మద్యం పాలసీని రూపొందించడంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయనే ఫిర్యాదుల మేరకు వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.
దర్యాప్తు ముమ్మరం..
సహా పలువురి నివాసంలో ఏక కాలంలో సీబీఐ అధికారులు ఏకకాలంలో దాడులు కొనసాగించిన విషయం తెలిసిందే. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో 21 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదే కేసులో ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా జోక్యం చేసుకోవడానికి రంగం సిద్ధమౌతోంది.
లుక్ అవుట్ జారీ చేయడం పట్ల
తనకు లుక్ అవుట్ సర్కులర్ను జారీ చేయడం పట్ల మనీష్ సిసోడియా స్పందించారు. తాను కనిపించట్లేదని, అజ్ఞాతంలోకి వెళ్లిపోయాననే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ-కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు తనకు లుక్ అవుట్ సర్కులర్ జారీ కావడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తాను స్వేచ్ఛగా ఢిల్లీలో తిరుగుతున్నానని, ప్రెస్ మీట్లను ఏర్పాటు చేస్తోన్నానని గుర్తు చేశారు. సీబీఐ అధికారుల దాడులు, ఎఫ్ఐఆర్లో తన పేరు పొందుపరిచిన తరువాత కూడా విలేకరుల సమావేశాల్లో మాట్లాడానని చెప్పారు.
ద్రవ్యోల్బణం, ధరలు భారిగా పెరిగినా..
దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిందని, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానికి ఎగబాకాయి. వాటి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మనీష్ సిసోడియా చెప్పారు. వాటి గురించి పట్టించుకోకుండా అకారణంగా రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయడానికి మోడీ సర్కార్ ప్రాధాన్యత ఇస్తోందని వ్యాఖ్యానించారు. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల నుంచి దేశ ప్రజల దృష్టిని మరల్చడానికి జిమ్మిక్కులు చేస్తోన్నారని ధ్వజమెత్తారు.
ప్రజల నుంచి లుక్ అవుట్..
2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలు నరేంద్ర మోడీకి లుక్ అవుట్ సర్కులర్ ఇవ్వడానికి సిద్ధమౌతున్నారని మనీష్ సిసోడియా చెప్పారు. నిరుద్యోగాన్ని నియంత్రించలేక చేతులెత్తేసిందని అన్నారు. తనను, అరవింద్ కేజ్రీవాల్ను జీరో చేయడం ద్వారా ధరలు అదుపులోకి వస్తాయా? అని ప్రశ్నించారు. ఇంకో ఒకట్రెండు రోజుల్లో తనను సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు.