ఒకే దేశం, ఒకే గుర్తింపు ఉంటే తప్పేమిటి: ఆధార్పై సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ఒకే దేశం, ఒకే గుర్తింపు ఉంటే తప్పేమిటని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఆధార్ అమలు పథకాన్ని తప్పు పడుతూ తృణమూల్ కాంగ్రెస్ సుప్రీంలో చేసిన సవాల్పై విచారణ జరిగింది.
ఆధార్ పథకంలో ప్రజా ప్రయోజనం కంటే రాజకీయ లబ్ధే ఎక్కువగా కన్పిస్తోందని కపిల్ సిబాల్ తన వాదనలను వినిపించారు. అయితే, భారత్ అంతా ఒకే గుర్తింపు ఉండాలనుకోవడంలో ఎంతమాత్రం తప్పులేదని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన అయిదుగురు సభ్యుల ధర్మాసనం తెలిపింది.
మనమంతా భారతీయులమని, నిజానికి భారతీయులమనేదే అతి పెద్ద గుర్తింపు అని, స్వాతంత్ర్య సమరయోధులు మనకందించిన వారసత్వమని, ఇది మనతో అంతమయ్యేది కాదని, మన ముందు తరాలకు మనం అందించే గొప్ప బహుమతి ఇదే అన్నారు. దేశమంతా ఒకే గుర్తింపు ఉండాలనే లక్ష్యంతో పెట్టిన ఆధార్ పథకంలో ఎందుకు తప్పులు ఎంచుతున్నారని ప్రశ్నించింది.
దీనికి స్పందించిన కపిల్ సిబాల్ భారతీయులమైనందుకు మనం గర్వించాలని, మధ్యలో ఈ ఆధార్ ఎందుకని, ఈ ఒక్క ఆధార్తోనే భారతీయులకు గుర్తింపు ఉంటుందనుకోవడం పొరపాటు అని, ఆధార్ రాకముందు వారందరూ భారతీయులు కారా, భారతీయుడికి ఉండాల్సిన హక్కుల్లో వ్యక్తిగత స్వేఛ్చ కూడా ఒకటి అని, ఆ హక్కును ఈ ఆధార్ హరిస్తుందన్నారు.
Recommended Video
డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచారం ఎంతమేరకు సురక్షితంగా ఉంటుందని, వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా పెట్టుకోవడం నా హక్కు అని, అలాగని ప్రభుత్వం తన ఆధార్ సమాచారాన్ని దుర్వినియోగం చేస్తోందనడం లేదని, ఈ ఆధార్ మీద ఎంతవరకు విశ్వసనీయత ఉందనేదే తన ప్రశ్న అన్నారు. ఇది డిజిటల్ యుగమని, ఎంతో సాంకేతిక అభివృద్ధి చెందిందని, వ్యక్తిగత సమాచారం గోప్యతపై సందేహం అవసరం లేదని సుప్రీం బదులిచ్చింది.