పూర్తి భిన్నంగా జగన్, కేసీఆర్ - మోదీ సర్కాను గట్టెక్కించిన వైసీపీ - బంగారు బాతును చంపేశారన్న కేకే
వివాదాస్పదంగా మారిన వ్యవసాయ బిల్లుల విషయంలో కేంద్రం ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకుంది. విపక్షాల నిరసనలు, పేపర్ల చింపివేత, సభాపతి మైక్ విరగొట్టే ప్రయత్నం, వ్యతిరేక నినాదాల నడుమ సదరు బిల్లులు.. మూజువాణీ ఓటుతో రాజ్యసభ గట్టెక్కాయి. పెద్దల సభలో మెజార్టీ లేని ఎన్డీఏను ఎలాగైనాసరే నిలువరించాలని విపక్షాలు చేసిన ప్రయత్నాలకు వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ అడ్డుగా నిలిచింది. అదే కేసీఆర్ నాయకుడిగా ఉన్న టీఆర్ఎస్ మాత్రం వ్యవసాయ బిల్లుల్ని తీవ్రస్వరంతో వ్యతిరేకించింది.

వైసీపీ మద్దతుతో మారిన సీన్..
రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) బిల్లు, రైతుల (సాధికారత, పరిరక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లు, నిత్యావసర సరుకుల (సవరణ) బిల్లులపై పలు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఉత్తరాదిలోనైతే లక్షల మంది రైతులు రోడ్లపై బైఠాయించి ఆందోళనలను కొనసాగిస్తున్నారు. రైతుల్ని అడ్డుకునేందుకు హర్యానాలో పెద్ద ఎత్తున పోలీసులను కూడా మోహరించారు. ఈ నేపథ్యంలో.. రైతుల అనుమానాలు తీర్చిన తర్వాతే వ్యవసాయ బిల్లులపై కేంద్రం ముందుకు వెళ్లాలని రాజ్యసభలో విపక్షాలు పట్టుపట్టాయి. డివిజన్ ఓటింగ్ పెడితే బీజేపీకి ఇబ్బందులు తప్పవని అనుకుండగానే.. తాము బిల్లులకు మద్దతు ఇస్తున్నట్లు వైసీపీ ప్రకటించడంతో సీన్ మారిపోయింది..

సాయిరెడ్డి తీరుపై ఆగ్రహం.
ఎన్డీఏలో ఒక్క జేడీయూ తప్ప మిగతా పార్టీలన్నీ వ్యవసాయ బిల్లుల్ని వ్యతిరేకించాయి. ఎన్డీఏలో లేనప్పటికీ వైసీపీ, ఏఐఏడీఎంకేలు బిల్లుకు మద్దతు తెలిపాయి. బిల్లులపై చర్చ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. బిల్లుల్ని వ్యతిరేకించడంలో అర్థంలేదని, కాంగ్రెస్ దళారీ పాత్రను పోశిస్తున్నదన్న సాయిరెడ్డిపై కాంగ్రెస్ సహా విపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. చర్చ సంద్భంగా టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు కీలక వ్యాఖ్యలు చేశారు..

కేకే కీలక వ్యాఖ్యలు..
కేంద్రం కొత్తగా తెచ్చిన వ్యవసాయ బిల్లులు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని, రైతులకు అండగా లేని ఇలాంటి చట్టాలు ఎందుకని టీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు ఆక్షేపించారు. కొత్త బిల్లులతో రైతులకు తీరని నష్టం కలిగే అవకాశముందని, వ్యవసాయ రంగంలో కార్పొరేట్లకు మేలు చేసేలా, మార్కెటింగ్ ఏజెంట్లకు సైతం నష్టం చేసే అంశాలున్నాయన్నారు. ‘‘కరోనా విపత్తు సమయంలో వ్యవసాయ రంగం ఒక్కటే స్థిరంగా నిలబడింది. అలాంటి బంగారు గుడ్లు పెట్టే బాతును కొత్త చట్టాలతో కేంద్రం చంపేస్తోంది. వ్యవసాయం, దాని అనుబంధ అంశాలు ఎల్లప్పుడూ రాష్ట్ర పరిధిలోనే ఉండాలి'' అని కేకే అన్నారు.
Recommended Video

భిన్నంగా జగన్, కేసీఆర్..
వ్యవసాయ రంగానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతున్నాయి. అయితే, వ్యవసాయ బిల్లులపై మాత్రం ఏపీ, తెలంగాణ అధికార పార్టీలు భిన్నంగా వ్యవహరించడం గమనార్హం. కొత్త బిల్లుల వల్ల పంటలకు కనీస మద్దతు ధర లేకుండా పోతుందని, పంటలు ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెప్పడం రాష్ట్రాలకు ఇబ్బందికర పరిణామమని, ఇది ఫెడరల్ వ్యవస్థకు ప్రమాదకరమని టీఆర్ఎస్ వాదించింది. వైసీపీ మాత్రం ఈ బిల్లులు దేశానికి, రైతాంగానికి మేలు చేస్తాయంటూ బీజేపీ వాదనను సమర్థించింది. వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు బిల్లులూ పార్లమెంటులో ఆమోదం పొందిన దరిమిలా గెజిట్ నోటిఫికేషన్ విడుదలపై కేంద్రం దృష్టిసారించింది.












Click it and Unblock the Notifications