మన 'ధారావి'పై డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు... కరోనా నియంత్రణకు ఆ మురికివాడ ఒక స్పూర్తి..
కరోనా వ్యాప్తిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన స్టేట్మెంట్ కాస్త ఊరట కలిగించేదిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా గత 6 వారాల్లో కేసుల సంఖ్య రెట్టింపు అయినప్పటికీ... ఇప్పటికీ కరోనా నియంత్రణ సాధ్యమేనని వెల్లడించింది. ఇటలీ,స్పెయిన్,ససససససౌత్ కొరియాతో పాటు భారత్లోని 'ధారావి'ని ఇందుకు ఉదాహరణగా చెప్పింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రియేసస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కిక్కిరిసిన జనసాంద్రతతో ఉండే ముంబైలోని మురికివాడలో వైరస్ వ్యాప్తి విజృంభించినప్పటికీ.. వ్యూహాత్మక చర్యలతో తిరిగి నియంత్రణ సాధించారని టెడ్రోస్ అన్నారు. 'టెస్టింగ్,ట్రేసింగ్,ఐసోలేటింగ్&ట్రీటింగ్'తో ఇది సాధ్యమైందన్నారు. ఇటలీ,స్పెయిన్,సౌత్ కొరియా దేశాల్లోనూ ఇదే రకమైన పద్దతిలో వైరస్ వ్యాప్తిని నియంత్రించినట్లు చెప్పారు. కాబట్టి వైరస్ విజృంభిస్తున్నప్పటికీ... ఇప్పటికీ దాని నియంత్రణ సాధ్యమేనని పేర్కొన్నారు. వైరస్ నియంత్రణకు సరైన నాయకత్వం,ప్రజల భాగస్వామ్యం,సామూహిక మద్దతు అవసరం అన్నారు.

వైరస్ నియంత్రణకు ధారావిని ఒక ఉదాహరణగా డబ్ల్యూహెచ్ఓ పేర్కొనడం చర్చనీయాంశమైంది. కేవలం 2.1 చదరపు కి.మీ పరిధిలో 10లక్షల పైచిలుకు జనాభా ఉండే ఈ ప్రాంతంలో మొదట్లో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. అయితే ముంబై పురపాలక సంస్థ(బీఎంసీ) తగిన చర్యలు తీసుకోవడంతో కేసుల సంఖ్య క్రమంగా తగ్గింది.
"In 🇻🇳🇰🇭🇹🇭🇳🇿🇮🇹🇪🇸 & 🇰🇷 & even in Dharavi, a densely packed area in Mumbai, a strong focus on community engagement & the basics of testing, tracing, isolating & treating all those that are sick is key to breaking the chains of transmission & suppressing the virus"-@DrTedros
— World Health Organization (WHO) (@WHO) July 10, 2020
కమ్యూనిటీ హెల్త్ కేర్ కార్మికులు, వైద్య బృందాలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ధారావిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన చర్యలు చేపట్టారు. దీంతో యాక్టివ్ కేసులు తగ్గిపోయాయి. గురువారం(జూలై 9) నాటికి ధారావిలో మొత్తం 2347 కేసులు నమోదవగా... అందులో యాక్టివ్ కేసులు 166 మాత్రమే కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications