2018 బడ్జెట్: ఎన్నికల వరాలుండేనా, వేతన జీవులకు నజరానాలు?
న్యూఢిల్లీ: ఎన్డిఏ ప్రభుత్వం ప్రవేశపెట్టే 2018 బడ్జెట్పై దేశ వ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠా ఎదురుచూస్తున్నారు. 2019లో ఎన్నికలు జరగునున్న నేపథ్యంలో ఎన్నికల వరాలను కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో కురిపించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలను ప్రసన్నం చేసుకొనే దిశగా బడ్జెట్ ఉంటుందని భావిస్తున్నారు.
Recommended Video
2019 ఎన్నికలు జరగనున్నాయి. 2018 బడ్జెట్ ఎన్డిఏ ప్రభుత్వ పూర్థిస్తాయి బడ్జెట్. 2019 ఎన్నికలకు ముందే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుంది.అయితే 2019లో నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు నిర్వహించేందుకు మోడీ సర్కార్ సానుకూలంగా ఉందనే చర్చ కూడ సాగుతోంది.
ఈ తరుణంలో ఎన్నికలను పురస్కరించుకొని ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రజలపై వరాలు కురిపించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.
ఎన్నికల బడ్జెట్
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఏడాది ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి మాసంలో మూడు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల షెడ్యూల్ కూడ ఈసీ ప్రకటించింది. దీంతో ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున బడ్జెట్ ఆ దిశగా ఉండే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ బీమాకు కూడా నిధులను కుమ్మరించవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు
ఉద్యోగులకు ఊరట దక్కేనా
ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ . దీంతో ఎన్నికల్లో మధ్య తరగతి, వేతన జీవులను తమవైపు తిప్పుకోవటానికి ఆదాయ పన్ను ఊరట అస్త్రాన్ని జైట్లీ ప్రయోగించవచ్చని నిపుణులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంచడం, పన్ను శ్లాబ్లలో మార్పులు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఐటీ మినహాయింపు పరిమితిని ప్రస్తుత రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని చాలాకాలంగా డిమాండ్లు ఉన్నాయి. ఈ మేరకు ఉద్యోగులకు తృప్తినిచ్చేలా కేంద్ర బడ్జెట్ ఉండే అవకాశం లేకపోలేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
జిఎస్టీ అమలైన తర్వాత తొలి బడ్జెట్
జిఎస్టీ అమలైన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇదే. మంద గమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం, ఉద్యోగాల సృష్టి, వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టడం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వంటి అంశాలు ఈ బడ్జెట్లో కీలకమవుతాయని భావిస్తున్నారు.ఈ బడ్జెట్ వస్తువుల ధరలపై పెద్దగా ప్రభావం చూపకపోయినా మధ్య తరగతి, వేతన జీవులతో పాటు కార్పొరేట్ వర్గాలు మాత్రం పన్నుల ఊరట కోసం ఆశగా చూస్తున్నాయి.
ద్రవ్యలోటుతో వరాలకు ఇబ్బందేనా
ద్రవ్యలోటు వల్ల బడ్జెట్ వరాలకు కొంత ఇబ్బందిగా మారే అవకాశం కూడ లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ద్రవ్యలోటును 3.2 శాతానికి కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ఇప్పటికే ఆ పరిధి దాటిపోయింది. ద్రవ్యలోటు లక్ష్యానికి కట్టుడకపోతే భారత రేటింగ్పై దాని ప్రభావం కన్పించే అవకాశం లేకపోలేదు. ముడి చమురు ధరలు పెరగడం కూడ ద్రవ్యలోటుపై ప్రబావం చూపుతోంది.