నా భర్తను ముద్దు పెట్టుకుంటా.. ఆపుతావా .. కరోనా రూల్స్ పాటించకుండా ఢిల్లీలో ఓ జంట హంగామా !!
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నియమాలను పాటించమని చెప్పినందుకు ఓ జంట హల్ చల్ చేశారు. పోలీసులపై విరుచుకుపడ్డారు. నోటికి వచ్చినట్లు మాట్లాడారు. కోవిడ్ వ్యతిరేక నియమాలను పాటించకపోవడం మరియు వారాంతపు లాక్డౌన్ ఉల్లంఘించినందుకు సదరు జంటపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఢిల్లీలో కరోనా నిబంధనలు పాటించకుండా ఓ జంట వీరంగం
ఢిల్లీ లో జంట పోలీసులతో గొడవ పడడానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరోనా నియమాలను ఉల్లంఘించి వారాంతపు లాక్ డౌన్ పాటించకుండా, మాస్కులు ధరించకుండా ఓ జంట పోలీసు సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించారు. ప్రభుత్వం విధించిన వారంతపు లాక్ డౌన్ పాటించని మహిళ , ఆమె భర్త నానా హంగామా చేశారు. నేను నా భర్తను ముద్దు పెట్టుకుంటాను.. మీరు నన్ను ఆపగలరా అంటూ పోలీసులపై వీరంగం వేసింది సదరు మహిళ.

మా కారు ఎందుకు ఆపారంటూ పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన జంట
అంతేకాదు లాక్ డౌన్ సమయంలో తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే కర్ఫ్యూ పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. కర్ఫ్యూ పాస్ కూడా తీసుకోకుండా పోలీసులపైనే ఫైర్ అయ్యారు సదరు దంపతులు
. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని దర్యాగంజ్ ప్రాంతంలో జరిగింది. మీరు నా కారును ఎందుకు ఆపారు? నేను నా భార్యతో కలిసి నా కారు లోపల ప్రయాణం చేస్తున్నాను అని మాస్క్ ధరించలేదని ప్రశ్నించిన పోలీసులతో సదరు వ్యక్తి చెప్పాడు .

చర్యలకు ఉపక్రమించిన పోలీసులు .. కేసు నమోదు
కారులో ప్రయాణం చేస్తున్న క్రమంలో కూడా మాస్క్ ధరించాలని ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించి ఒక పోలీసు చెప్పిన తరువాత కూడా ఈ జంట పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో వారిపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ ఘటనలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన పంకజ్ దత్తా అనే వ్యక్తిని అరెస్టు చేశారు, ఈ రోజు ఉదయం కోర్టుకు హాజరుపరుస్తారు. అభ గుప్తా అనే మహిళను, పంకజ్ దత్తా భార్యను కూడా కూడా త్వరలో అరెస్టు చేయనున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.
ఇప్పటికే కరోనా రూల్స్ బ్రేక్ చేసిన వారిని 323 మందిని అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
ఢిల్లీ గత కొన్ని రోజులుగా అత్యధిక కరోనా కేసులను నివేదిస్తోంది. ఆదివారం, దేశ రాజధానిలో 25 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత వారం, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కరోనా వ్యాప్తిని నియంత్రించటం కోసం వారాంతపు లాక్డౌన్ ప్రకటించారు. లాక్డౌన్ సమయంలో కోవిడ్-రూల్ ఉల్లంఘనల కోసం ఢిల్లీ పోలీసులు 569 ఎఫ్ఐఆర్ లను నమోదు చేశారు. తర్వాత నియమాలు పాటించని వారికి 2,369 చలాన్ల ద్వారా ఫైన్ వేశారు . ఇదే కాలంలో 323 మందిని కూడా అరెస్టు చేశారు.
.












Click it and Unblock the Notifications