వచ్చే ఎన్నికల్లో రాహుల్, ప్రియాంక పోటీ ఇక్కడే !మోడీపై పోటీకి సై ?
వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఏ నియోజవర్గం నుంచి ఎంపీ అభ్యర్ధులుగా బరిలోకి దిగబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని అమేథీతో పాటు కేరళలోని వాయనాడ్ నుంచి బరిలోకి దిగిన రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయి వాయనాడ్ లో గెలిచారు. దీంతో ఈసారి ఆయన ఈ రెండు సీట్లలో ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, అలాగే ఆయన సోదరి ప్రియాంక ఎక్కడి నుంచి బరిలోకి దిగనున్నారనే దానిపై చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో యూపీ కాంగ్రెస్ కొత్త ఛీఫ్ గా నియమితులైన అజయ్ రాయ్ ఇవాళ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోటీ చేసే నియోజకవర్గాలపై హింట్ ఇచ్చేశారు. రాహుల్ గాంధీ ఈసారి కూడా యూపీలోని అమేథీ నియోజకవర్గం నుంచే బరిలోకి దిగబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ నేత స్మృతీ ఇరానీ చేతిలో ఓటమి పాలైన రాహుల్.. ఈసారి కూడా అక్కడి నుంచి బరిలోకి దిగబోతున్నట్లు అజయ్ రాయ్ పేర్కొన్నారు.

మరోవైపు ప్రస్తుతం యూపీలో కాంగ్రెస్ బాధ్యతలు దగ్గరుండి చూస్తున్న రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ కూడా ఈసారి అదే రాష్ట్రం నుంచి లోక్ సభకు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై అజయ్ రాయ్ ను ప్రశ్నిస్తే ఆమె ఎక్కడి నుంచి కావాలనుకంటే అక్కడి నుంచి బరిలోకి దిగొచ్చంటూ సంకేతం ఇచ్చారు. అలాగే వారణాసిలో ప్రధాని మోడీపై పోటీ చేయాలని ప్రియాంక భావిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఆమె విజయం కోసం కృషిచేస్తారంటూ అజయ్ రాయ్ తెలిపారు.
మరోవైపు 2019లో వారణాసి నుంచి ప్రధాని మోదీపై ప్రియాంక గాంధీ పోటీ చేయవచ్చని ఊహాగానాలు చెలరేగినా..చివరి క్షణంలో అజయ్ రాయ్ వారణాసి నుంచి పోటీకి దిగారు. 2014లో కూడా అజయ్ రాయ్ వారణాసి నుంచి పోటీ చేసి నరేంద్ర మోదీ చేతిలో ఓడిపోయారు. 2024 లోక్సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు, బ్రిజ్లాల్ ఖబ్రీ స్థానంలో అజయ్ రాయ్ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. దీంతో ఆయన రెండుసార్లు ఓడిపోయిన వారణాసిలో ఈసారి ప్రియాంక బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications