టిక్టాక్ స్టార్కు ఎమ్మెల్యే టికెట్, లక్షలాదిమంది ఫాలోవర్లు, గెలిస్తే..
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ద్వారా లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అదే స్థాయిలో కలుగుతున్నాయి. తప్పుడు వార్తలు ప్రచారంతో భారీ నష్టాలే జరుగుతున్నాయి. అయితే సోషల్ మీడియాను సమాజ శ్రేయస్సు కోసం కూడా ఉపయోగించి మేలు చేయవచ్చు. తాజాగా సరదా వీడియో యాప్ టిక్టాక్ ఓ మహిళను స్టార్ను చేసింది. అంతేగాక, ఆమెకు ఎమ్మెల్యే టికెట్ కూడా రావడం విశేషం.

ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి షాకింగ్..
వివరాల్లోకి వెళితే.. హర్యానాకు చెందిన సొనాలీ ఫోగట్ టిక్టాక్లో అనేక వీడియోలతో లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఆమె వీడియోలు ఆకట్టుకునేలా ఉండటంతో రోజు రోజుకు ఆమె ఫాలోవర్ల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. దీంతో పలు రాజకీయ పార్టీలు కూడా ఆమెను తమ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదిపాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో భారతీయ జనతా పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా సొనాలీకి అదంపూర్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ కేటాయించింది బీజేపీ. గురువారం బీజేపీ విడుదల చేసిన రెండో జాబితాలో సొనాలీ ఫోగట్ పేరు ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకే..
అదంపూర్లో కాంగ్రెస్ కేడర్ బలంగా ఉన్నప్పటికీ బీజేపీ అక్కడ తన జెండా ఎగరేయాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే సొనాలీకి టికెట్ కేటాయించింది బీజేపీ. కాగా, అదంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయికే కాంగ్రెస్ టికెట్ కేటాయించే అవకాశం ఉంది. అయితే, సొనాలీ కాంగ్రెస్ పార్టీకి గట్టిపోటీ ఇస్తుందని భావిస్తోంది.

ఒకే కుటుంబం.. రికార్డేనా..
2000, 2005 ఎన్నికల్లో అదంపూర్ నుంచి హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ పోటీ చేసి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి గతంలో 8సార్లు భజన్ లాల్ కుటుంబసభ్యులే గెలుపొందడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఒక సోషల్ మీడియా స్టార్కు బీజేపీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. మరి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీచేస్తున్న సొనాలి అదంపూర్ నియోజకవర్గంలో గెలిచి రికార్డ్ సృష్టిస్తుందో.. లేదో ఎన్నికల తర్వాతే తేలనుంది.

సీరియళ్లు.. సినిమాల్లోనూ.. గెలిస్తే...
కాగా, తనకు బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంపై సొనాలీ స్పందిస్తూ.. టిక్టాక్ వల్లే తనకు టికెట్ వచ్చిందన్నారు. అంతేగాక, తాను గత 12ఏళ్లుగా బీజేపీ కోసం పనిచేస్తున్నానని తెలిపారు. మధ్యప్రదేశ్ ట్రైబల్ మోర్చాగా పనిచేసిన సమయంలో అక్కడి వారినంతా బీజేపీకి దగ్గర చేశానని చెప్పారు. అది తనకు చాలా ఆసక్తికర అనుభవమని తెలిపారు. తాను పలు సీరియల్స్, సినిమాల్లో కూడా నటించినట్లు చెప్పారు సొనాలి. అందుకే తాను టిక్టాక్ యాప్తో అభిమానులకు మరింత చేరువయ్యానని తెలిపారు. తనకు పార్టీ టికెట్ కేటాయించిన తర్వాత తాను బాలికల భద్రత, యువతలో జాతీయభావం, దేశభక్తి పెంపొందించే వీడియోలను పోస్టు చేస్తున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్యేగా గెలిపిస్తే..
గత 50ఏళ్లుగా అదంపూర్ నియోజకవర్గంలో ఒకే కుటుంబం అధికారంలో ఉందని, అయితే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. కాంగెస్ అభ్యర్థి కుల్దీప్ బిష్ణోయి ఓ వ్యాపారి అని, అతనికి క్షేత్రస్థాయిలో సమస్యలు తెలియవని సొనాలి వ్యాఖ్యానించారు. అతను కూడా నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా గెలిసిస్తే నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ కేంద్రమంత్రి, దివంగత నేత సుష్మా స్వరాజ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తనకు ఆదర్శమని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications