బీహార్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ.. మూడంచెల రక్షణతో .. 38 జిల్లాలకు 55 కౌంటింగ్ కేంద్రాలు
బీహార్ ఎన్నికల కౌంటింగ్ కోసం బీహార్ రాష్ట్ర ఓటర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోపక్క బీహార్ ఎన్నికల బరిలో హోరాహోరీగా ప్రచారం సాగించి ఓటర్ల తుది తీర్పు కోసం ప్రధాన పార్టీలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ మహా ఘట్ బంధన్ కు పట్టం కట్టగా బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాల ప్రజా తీర్పు ఎగ్జిట్ పోల్స్ తీర్పును ప్రతిబింబిస్తుందా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది .
బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. దీంతో రేపు బీహార్ లో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

లెక్కింపు కేంద్రాల్లోనూ మూడంచెల భద్రతా వ్యవస్థ
243 స్థానాలలో శాసనసభ్యులుగా బరిలోకి దిగిన వారి భవితవ్యం రేపు తేలబోతుంది .
కట్టుదిట్టమైన భద్రత మధ్య లెక్కింపు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అక్టోబర్ 28, నవంబర్ 3 మరియు నవంబర్ 7 న మూడు దశల్లో ఓటు వేసిన రాష్ట్రంలోని మొత్తం 38 జిల్లాలకు సంబంధించి 55 కౌంటింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. లెక్కింపు కేంద్రాలలో మూడంచెల భద్రత కల్పించారు. మొదటి అంచెలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) ఉంటుంది. రెండవ అంచెలో బీహార్ మిలిటరీ పోలీసులు పర్యవేక్షిస్తారు . మూడవది రాష్ట్రవ్యాప్తంగా 38 స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించి జిల్లా సాయుధ పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు .
బీహార్ పోలీసు అధికారులు 1,900 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సిఎపిఎఫ్) రాష్ట్ర రాజధానితో సహా 38 స్ట్రాంగ్ రూములకు రక్షణగా ఉన్నారని చెప్తున్నారు.

స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రంగా ఈవీఎం లు .. 3,558 మంది అభ్యర్థుల భవిష్యత్ తేలేది రేపే
పాట్నాలోని 14 కాలేజీలలో నియోజకవర్గాల ఈవీఎంలు నిల్వ భద్రపరచబడ్డాయి . పాట్నాలోని ఎఎన్ కళాశాల ప్రాంగణం రాష్ట్రంలోనే అతిపెద్ద స్ట్రాంగ్రూమ్ గా ఉంది .
రాష్ట్రంలోని 55 కేంద్రాల్లో మొత్తం 106,524 ఈవీఎంలు లెక్కించాల్సి ఉంది . 370 మంది మహిళలు మరియు ఒక ట్రాన్స్తో జెండర్ తో సహా 3,558 మంది అభ్యర్థుల భవిష్యత్ ను ఇవి నిర్ణయిస్తాయి. నవంబర్ 10 న ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ ప్రక్రియను వీడియో రికార్డ్ చెయ్యనున్నట్టు అధికారులు తెలిపారు. కౌంటింగ్ లో ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు .

కరోనా సమయంలో తొలి ఎన్నికల ఫలితాలపై అందరి ఆసక్తి
అధికారిక డేటా ప్రకారం, కోవిడ్ -19 మహమ్మారి ఉన్నప్పటికీ, బీహార్ ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో 57.05% ఓటింగ్ నమోదైంది. 2015 ఎన్నికలలో ఓటింగ్ శాతం 56.66%. బీహార్లో మొత్తం 729 మిలియన్ల ఓటర్లలో 50% పైగా 18 నుంచి 39 ఏళ్ల మధ్య వయస్సు గలవారని ఇసిఐ డేటా ద్వారా తెలుస్తుంది .
కరోనావైరస్ వ్యాప్తి మధ్య మొదటిసారి నిర్వహించిన మూడు దశల బీహార్ ఎన్నికలపై అందరి ఆసక్తి ప్రత్యేకంగా ఉంది .
Recommended Video

లాలూ యాదవ్ , రాం విలాస్ పాశ్వాన్ లేకుండా మూడు దశాబ్దాలలో జరిగిన మొదటి ఎన్నికలు ఇవే
పశుగ్రాసం కుంభకోణ కేసుల్లో దోషిగా తేలిన తరువాత రాంచీ జైలులో మగ్గుతున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్, మరియు లోక్ జనశక్తి పార్టీ (ఎల్జెపి) చీఫ్ రామ్ విలాస్ పాస్వాన్ లేకుండా మూడు దశాబ్దాలలో జరిగిన మొదటి ఎన్నిక ఇది. తేజశ్వి యాదవ్ , ఎల్జెపి చిరాగ్ పాస్వాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న యువ తరానికి అధికారం అప్పగించాలని బీహార్ ఓటర్లు నిర్ణయించారా అనేది రేపు తేలనుంది . ఈ నేపథ్యంలో రేపు కౌంటింగ్ కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు.












Click it and Unblock the Notifications