భీం మహాసంఘం విజయ్ సంకల్ప్ ర్యాలీ: ప్రపంచ రికార్డ్ దిశగా బీజేపీ, 5వేల కిలోల కిచిడీ వంటకం!
ఢిల్లీ: 2019 లోకసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రపంచ రికార్డుతో పాటు దళిత ఓటు బ్యాంకుపై దృష్టి సారించింది. ఇందుకోసం భీమ్ మహా సంగమ్ విజయ్ సంకల్ప్ పేరుతో ఢిల్లీలో బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించనున్నది. ఆదివారం జరగనున్న ఈ ర్యాలీలో ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు ఆ పార్టీ నాయకులు ఐదువేల కిలోల కిచిడీ వండుతున్నారు. దీనిని 750 కిలోల కుండలో వండుతున్నారు.
ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా అధ్యక్షతన ఈ ర్యాలీ జరుగుతోంది. దళితుల ఇళ్ల నుంచి సేకరించిన బియ్యం, ధాన్యాలతో ఈ భారీ వంటకాన్ని ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో తయారు చేస్తారు. అనంతరం దీనిని అందరికీ పంచిపెడతారు. తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం దళిత సామాజిక వర్గాలకు చేస్తున్న మేలు గురించి అమిత్ షా మాట్లాడుతారు.
నవంబరు 2017లో కూడా బీజేపీ ఇలాంటి కార్యక్రమం చేపట్టింది. ఆ సమయంలో ఆహార మంత్రిత్వశాఖ నిర్వహించిన ప్రపంచ ఫుడ్ ఇండియా ఫెస్టివల్లో భాగంగా ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ 918 కిలోల కిచిడీని వండారు. ఇప్పుడు బీజేపీ ఏకంగా 5,000 కిలోల కిచిడీ వండనుంది.