గోవాలో వేడెక్కిన రాజకీయం: ఆస్పత్రిలో సీఎం మనోహర్ పారికర్, గవర్నర్ వద్దకు కాంగ్రెస్
పనాజీ: గోవా సీఎం మనోహర్ పారికర్ అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన వేళ గోవాలో మళ్లీ రాజకీయ వేడెక్కింది. గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్ర గవర్నర్కు మెమోరాండం ఇచ్చింది.
పారికర్ అనారోగ్యం కారణంగా తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు బీజేపీముగ్గురు సీనియర్ నేతల్ని గోవాకు పంపగా.. వారు గోవా బీజేపీ నేతలు, మిత్రపక్షాలతో సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది.
మాకు అవకాశమివ్వండి: గవర్నర్కు కాంగ్రెస్ వినతి
గోవాలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని రద్దు చేసి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ సోమవారం ఆ రాష్ట్ర గవర్నర్కు లేఖ అందించింది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయని, వెంటనే అక్కడ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా కాంగ్రెస్ను ఆహ్వానించాలంటూ గవర్నర్ మృదులా సిన్హాకు ఆ పార్టీ నాయకులు లేఖ అందించారు.
ప్రస్తుతం అక్కడి అసెంబ్లీలో 40 మంది ఎమ్మెల్యేలకు గానూ కాంగ్రెస్కు 16, బీజేపీకి 14 సభ్యల చొప్పున సంఖ్యా బలం ఉంది. బీజేపీ మిత్ర పక్షాలైన ఎంజీపీ, గోవా ఫార్వర్డ్ పార్టీలకు చెరో ముగ్గురు ఎమ్మెల్యేల చొప్పున ఉన్నారు.