కోడిని దొంగిలించిందని మహిళ తల నరికేశారు
గౌహతి: అస్సాం రాష్ట్రంలోని సోనిత్పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కోడిని దొంగిలించిందనే కారణంగా ఓ ఆదివాసి మహిళ తలను నరికేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
సోనిత్పూర్ జిల్లాలోని బార్ఘులి ప్రాంతానికి చెందిన ఫాగుని కవారి(50) కుటుంబానికి, అదే ప్రాంతానికి చెందిన మరో కుటుంబానికి మధ్య కోళ్ల దొంగతనం అంశంపై గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.
ఫాగుని కుటుంబం తమ కోళ్లను దొంగలించి విందు చేసుకుంటోందని నిందితుల కుటుంబం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో నలుగురు నిందితులు ఓ పదునైన ఆయుధంతో ఫాగుని తల నరికి, ఆమె భర్తను తీవ్రంగా గాయపర్చారు.
కాగా, ఫాగుని కుటుంబసభ్యులు తమని తాము రక్షించుకునేందుకు అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.
బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. కాగా, మృతురాలు మంత్రాలు చేస్తున్న నేపథ్యంలోనే హత్య జరిగిందని పలువురు పేర్కొంటున్నారు.