వర్జిన్ టెస్ట్తో పెళ్లి: ఐదేళ్లపాటు టెక్కీకి నరకం చూపిన భర్త
బెంగళూరు: తన భర్త పైశాచిక ప్రవర్తనను ఐదేళ్లుగా భరించిన ఓ భార్య.. ఆ చిత్రహింసలు శృతి మించడంతో చివరకు పోలీసులను ఆశ్రయించకతప్పలేదు. బెంగళూరు మిర్రర్ కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాయ(పేరు మార్చాం)కు 2011లో విదేశాల్లో పనిచేస్తున్న ఓ సైంటిస్ట్ సంబంధం వచ్చింది.
మ్యాట్రిమోని సైట్ ద్వారా పరిచయాలు పూర్తయ్యాక తాంబూలాలు కూడా పుచ్చుకున్నారు. ఆ తర్వాత తన కాబోయే భార్యకు మొదట్లోనే అతనో షాకిచ్చాడు. ఆమెకు ఓ పరీక్ష పెడతానని, అందులో పాసైతేనే పెళ్ళాడతానని అన్నాడు.
వరుడు విదేశాల్లో ఉంటున్న వ్యక్తి కావడంతో ఆధునిక భావాలుంటాయని, అందువల్ల ఏదైనా వ్యక్తిత్వ వికాస పరీక్ష పెడతాడేమోనని అనుకుంది వధువు, ఆమె కుటుంబసభ్యులు. తీరా చూస్తే ఆమె కన్యనో కాదో తెలుసుకునే వర్జిన్ టెస్ట్ చేయించుకోవాలని షరతు పెట్టాడు.
ఇదేదో మంచి సంబంధమని కుటుంబసభ్యులంతా సంబరపడిపోవడం చూసిన వధువు.. వారిని నిరాశపరచడం ఇష్టం లేక, మనసు చంపుకుని ఈ పరీక్షకు కూడా ఒప్పుకుంది. అదీగాక ఈ పరీక్షకు తాను ఒప్పుకోకుంటే తనపై ఇంకా అనుమానాలు పెరుగుతాయని భయపడ్డానని, పైగా తాంబూలాలు కూడా పుచ్చుకోవడంతో తన కుటుంబ సభ్యులు భారీ ఖర్చులతో చాలా ఏర్పాట్లు చేసుకున్నారని మాయ పోలీసులకు తెలిపింది.

వరుడు తన అక్కచెల్లెళ్లను తోడిచ్చి రాజాజీనగర్లోని ఓ ఆస్పత్రిలో తన కాబోయే భార్యకు ఈ పరీక్ష చేయించాడు. మాయ కన్యేనని డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకుని పెళ్లి చేసుకున్నాడు. అసలింతకీ భర్త తనకు ఈ వర్జిన్ టెస్ట్ ఎందుకు పెట్టాడని ఆమె ఆరా తీస్తే అసలు సంగతి బయటపడింది. పెళ్లికి ముందు మాయ ఫేస్బుక్ పేజీ చూసిన ఆమె భర్త.. అందులో ఉన్న ఆమె స్నేహితుల ఫోటోలు చూసి తను కన్యో కాదోనని సందేహించి వర్జిన్ టెస్ట్ కోసం పట్టుబట్టాడట.
ఇదంతా సజావుగా సాగడంతో పెళ్లి తంతు కూడా పూర్తయింది. అయితే, ఆ నవ వధువు మాయకు మాత్రం సంతోషం లేకుండా పోయింది. ఐదేళ్ళుగా ఆ సైంటిస్ట్ భర్త మాయను మానసికంగా హింసిస్తూనే ఉన్నాడు. ఇది ఇలావుంటే.. మరింత కట్నం కావాలని అత్తమామల వేధించడం మొదలుపెట్టారు.
రాను రాను ఆ సైంటిస్ట్, శాడిస్ట్ భర్త నుంచి మాయకు వేధింపులు ఎక్కువయ్యాయి.
కాగా, తన ఈ శాడిస్ట్ సైంటిస్ట్ భర్త ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా అక్కడున్న విలువైన వస్తువుల్ని సీసీ కెమెరాలక్కూడా దొరక్కుండా దోచేస్తాడని, పైగా తనను కూడా అలా దొంగతనాలు చెయ్యమని ఒత్తిడి చేస్తుంటాడని మాయ తెలిపింది.
ఐదేళ్ళుగా నరకం అనుభవిస్తున్నానంటూ ఇప్పుడు పోలీసులను ఆశ్రయించింది.
ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఐదేళ్ల క్రితం నుంచి జరిగిన పరిణామాలపై దృష్టి సారిస్తున్నారు. మాయ భర్తకు నోటీసులు పంపి ఇద్దరి నుంచీ స్టేట్మెంట్లు తీసుకుంటామని చెప్పారు. ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి వారి కాపురాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తామంటున్నారు పోలీసులు.












Click it and Unblock the Notifications