అర్థం లేనిది: సునంద మృతిపై థరూర్, అమర్ సింగ్కు సిట్ పిలుపు
న్యూఢిల్లీ: తన భార్య సునంద పుష్కర్ హత్య కేసు నేపథ్యంలో తాను పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసే ప్రసక్తి లేదని మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ స్పష్టం చేశారు. రాజీనామా చేయాలనే డిమాండ్ అర్థం లేనిదని ఆయన అన్నారు. సిఎన్ఎన్ -ఐబిఎన్కు ఆయన బుధవారం ఉదయం ఇంటర్వ్యూ ఇచ్చారు.
తన భార్య మృతిపై తనను పోలీసులు ప్రశ్నించిన నేపథ్యంలో తాను ఎంపిగా రాజీనామా చేయాలనే డిమాండ్ రావడం పట్ల మీడియాపై, తమ కాంగ్రెసు పార్టీలోని ఒక వర్గంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నిబంధనలున్నాయని, సమాజంలో నిబంధనలున్నాయని, చట్టాలున్నాయని, తాను చట్టాలను గౌరవిస్తానని, అలా గౌరవిస్తూ వస్తున్నానని ఆయన అన్నారు.
థరూర్ రాజీనామాకు కాంగ్రెసు నేత చాకో డిమాండ్ చేయడాన్ని ప్రస్తావించగా, కాంగ్రెసు నాయకుడు ఎవరైనా ఆ విధంగా మాట్లాడితే, ఆ నాయకుడు ఏ ప్రాతిపదికపై అలా మాట్లాడాడో పార్టీ అధిష్టానానికి వివరణ ఇవ్వాలని ఆయన అన్నారు. తాను బిజెపిలో చేరుతున్నట్లు వచ్చిన పుకార్లను కూడా ఆయన కొట్టిపారేశారు. బిజెపిలో చేరడమనేది తనకు మింగుడు పడని విషయమని ఆయన అన్నారు.
సునంద పుష్కర్ హత్య కేసులో మరోసారి శశి థరూర్ను పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మీడియాపై, ఒక వర్గం కాంగ్రెసు నాయకులపై తీవ్రంగా మండిపడ్డారు. జనవరి 19వ తేదీన నాలుగు గంటల పాటు పోలీసులు ఆయన విచారించారు.
ఇదిలావుంటే, సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు రాజకీయ నాయకుడు అమర్ సింగ్ను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో ఏ విధమైన సమాచారం ఉందో తెలుసుకోవడానికి తాము అమర్ సింగ్ను ప్రశ్నిస్తామని ఢిల్లీ పోలీసు చీఫ్ బిఎస్ బస్సీ చెప్పారు. మీడియాకు అమర్ సింగ్ కొంత సమాచారం ఇచ్చారని, అమర్ సింగ్ను విచారణకు ఈ రోజే పిలిచామని ఆయన చెప్పారు.
మరణానికి రెండు రోజుల ముందు సునంద పుష్కర్ తనతో మాట్లాడారని, ఐపియల్ వ్యవహారంపై మాట్లాడారని అమర్ సింగ్ చెప్పారు. సునంద పుష్కర్ తమను పిలిచినట్లు ఇద్దరు జర్నలిస్టులు కూడా సిట్కు తెలిపారు. ఐపియల్ వ్యవహారాలపై శశి థరూర్ విషయాలు చెప్తానని ఆమె చెప్పినట్లు వారు తెలిపారు