‘లింక్స్’ పంపిస్తాం, ఇంటి నుంచే వాదించండి: లాయర్లకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: కరోనావైరస్ దేశంలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా, సుప్రీంకోర్టు కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి న్యాయవాదులు నేరుగా వచ్చి వాదించాల్సిన అవసరం లేదని, అత్యవసర కేసుల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటి నుంచే వాదించాలని సూచించింది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేశామని తెలిపింది.
లింక్స్ పంపిస్తాం..ఇంటినుంచే వాదించండి..
న్యాయవాదులకు కొన్ని ఆన్లైన్ లింక్స్ ఇస్తామని, వాటిని డౌన్ లోడ్ చేసుకుని వీడియో కాల్ కనెక్ట్ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే తెలిపారు. తాము మళ్లీ చెప్పే వరకు కూడా కోర్టు భవనంలోని న్యాయవాదుల చాంబర్లన్నీ మూసివేయాలని సిబ్బందిని ఆదేశించారు.
లాయర్ల చాంబర్లు ఖాళీ చేయాల్సిందే..
కాగా, లాయర్ల ఎలక్ట్రానిక్ పాస్ లను కూడా రద్దు చేశారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల నుంచి కోర్టులోని లాయర్ల చాంబర్లన్నీ మూసీవేయనున్నారు. మంగళవారం సాయంత్రం వరకు ఏమైనా ముఖ్యమైన పత్రాలు ఉంటే న్యాయవాదులు తీసుకెళ్లాలని సీజే ఆదేశించారు.
కేంద్రం చర్యల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇలా..
కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలు, జిల్లాల్లో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. కరోనాను కట్టడి చేయాలంటే కఠిన ఆంక్షలు తప్పవని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. కేంద్రం చర్యల నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా కరోనా కట్టడికి తాజా చర్యలకు పూనుకుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఏడుగురు కరోనా బాధితులు మరణించగా.. 415 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశం లాక్డౌన్.. ప్రజంతా బాధ్యతతో మెలగాలి..
కాగా, దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విధించిన లాక్ డౌన్ పట్ల ప్రజలు నిర్లక్ష్యం వహించరాదని ప్రధాని మోడీ కోరారు. అందరూ ఆరోగ్య సూచనలు పాటించాలని ఆయన సోమవారం ట్విట్టర్ వేదికగా సూచించారు. లాక్ డౌన్ పట్ల ప్రజలు నిర్లక్ష్యంగా ఉండరాదని, దీన్ని ఎందుకు అమలు చేశామో గుర్తించాలని కోరారు. లాక్డౌన్ ను తీవ్రంగా పరిగణించి దేశ ప్రజలందరూ పాటించాలన్నారు. మనల్ని మనం రక్షించుకోవడానికే లాక్ డౌన్ విధించికున్నామని, దీని గురించి అందరూ అర్థం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నియమాలను ఖచ్చితంగా అమలు చేయాలని, నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తుల్లో ముప్పు పెరుగుతుందని హెచ్చరించారు. ఇటలీ, ఇరాన్, స్పెయిన్ అనుభవాలు మరిచిపోవద్దని అన్నారు. దేశంలో ప్రతి ఒక్క పౌరుడు తన బాధ్యతను గుర్తించి ప్రవర్తించాలన్నారు.